
‘అల్లరి’ నరేష్ హీరోగా ఓ సినిమా వస్తోందంటే కామెడీ ఇష్టపడేవాళ్లంతా ఎదురుచూసేవారు. ఆ రోజులు వెళ్లిపోయాయి. ఇప్పుడు ఆయన సీరియస్ సినిమాలు చేస్తున్నారు. ఆయన నటించిన తాజా సినిమా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ . ఎన్నికల నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ‘నాంది’తో గతేడాది ‘అల్లరి’ నరేష్ ఖాతాలో మంచి విజయం చేరింది. ఆ విజయం కొనసాగించేలా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఉందా? అనేది రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
గవర్నమెంట్ తెలుగు టీచర్ శ్రీపాద శ్రీనివాస్ (అల్లరి నరేష్) ఓ మంచి మనిషి. ఎన్నికల డ్యూటీ నిమిత్తం రంప చోడవరం సమీపంలోని మారెడుమిల్లి వెళతాడు. అక్కడ జనాలు ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులతో విసిగిపోయి ఉంటారు. పురిటి నొప్పులు పడుతున్న మహిళలను ఆసుపత్రికి తీసుకు వెళ్ళాలంటే నది దాటాలి. చదువు సంధ్యలకు ఇబ్బంది పడుతూంటారు. దాంతో రోడ్డు, స్కూల్, హాస్పటల్ వంటి కనీస వసతి సౌకర్యాలు లేని ఆ ప్రాంతం ప్రజలు ఎన్నికలను బహిష్కరిస్తారు. కానీ అక్కడ శ్రీనివాస్ చేసిన సాయం, మంచితనం చూసి ఓట్లు వేయాటనికి ముందుకు వస్తారు. గ్రామంలో ఉండే లక్ష్మి (ఆనంది) అతనికి అండగా నిలబడుతుంది. ఎన్నికల పూర్తి తర్వాత ఓటింగ్ మిషన్స్తో వెళుతున్న శ్రీనివాస్ అండ్ టీమ్ని గ్రామస్థులు తమలో ఒకడైన కండా (శ్రీతేజ) సాయంతో కిడ్నాప్ చేస్తారు. అసలు కండా ఎందుకు శ్రీనివాస్ని కిడ్నాప్ చేస్తాడు? అసలు వారికి కిడ్నాప్ ఆలోచన ఎలా వచ్చింది? కలెక్టర్ (సంపత్ రాజ్) సహా ప్రభుత్వం మారేడుమిల్లి సమస్యను ఎలా పరిష్కరిస్తారు? కిడ్నాప్ అయిన అధికారులను విడిపించడానికి ప్రభుత్వం ఏం చేసింది? చివరకు ఏం అయ్యింది? లక్ష్మి (ఆనంది) ఎవరు? అనేది మిగతా సినిమా. అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
అల్లరి నరేష్ అనే తన కామెడీ ఇమేజ్ ను మెల్లమెల్లగా పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తొలి సినిమానే ఇంటి పేరుగా పెట్టుకున్నా.. కామెడీ హీరో అన్న ట్యాగ్ వచ్చినా.. తన వరకూ వచ్చిన ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్ లోనూ సత్తా చాటాడు. అయితే ఆ మధ్య కొన్నేళ్లుగా అతని కామెడీ సినిమాలేవీ పెద్దగా ఆడ లేదు. మరోవైపు నరేష్ కామెడీ సినిమా అంటే స్పూఫ్ లు , స్టేల్ అయ్యిపోయింది అనే టాక్ బయిలుదేరింది. దీంతో వేరే దారిలేక, అనివార్యంగా తన ఇమేజ్ ను దాటి కొత్త కథలు చెప్పడానికే సిద్ధమయ్యాడు నరేష్. ఆ క్రమంలో వచ్చిందే నాంది. న్యాయవ్యవస్థలోని ఓ ముఖ్యమైన సెక్షన్ ను అత్యంత సీరియస్ గా డిస్కస్ చేసిన ఈ సినిమా కమర్షియల్ గా కూడా బాగా ఆకట్టుకుంది. దాంతో కంటెంట్ కు పెద్ద పీట వేసే సినిమాలే చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు. అలా వస్తోన్న మరో సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. కాకపోతే ప్రతీ సినిమా ‘నాంది’ లా అవ్వాలంటే కష్టం. ఈ సినిమాలో అంత బలమైన అంశం ఏమీ లేదు.
స్టోరీ లైన్ ..ఏదో సందేశాత్మక చిత్రం అన్నట్లు ఉంది. మొదట హిందీ హిట్ చిత్రం న్యూటన్ ని గుర్తు చేసినా, మెల్లిగా తనదైన దారిలో వెళ్లే ప్రయత్నం చేసాడు దర్శకుడు. అందుకోసం అతను ఎంచుకున్న నేపధ్యం కొత్తగా అనిపించినా సీన్స్ మాత్రం పాతగానే ఉన్నాయి. సినిమా మొదలైన పది నిమిషాల్లోనే సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఏంటి?ఎటు వెళ్తోంది అనేది సాధారణ ప్రేక్షకుడుకి కూడా పూర్తిగా అర్థమవుతుంది. ఇక హీరో పాత్రలో ఊళ్లోకి ఎంట్రీ ఇచ్చిన కాసేపటికి సినిమా ఎలా సాగుతుందో పూర్తిగా అర్దమైపోతుంది. ఇంటర్వెల్ సమయానికి సినిమా క్లైమాక్స్ ఏంటో కూడా సాధారణ ప్రేక్షకుడికి అర్థమవుతుంది. ఇలా అర్దమైపోవటానికి కారణం కేవలం స్క్రీన్ ప్లే లోపమే అని చెప్పాలి. ఈ సినిమాలో కిడ్నాప్ సస్పెన్స్ ఎలిమెంట్ మినహా ఎలాంటి ట్విస్టులు, టర్నులు లేకుండా సాగుతుంది. అదీ ఊహించేయగలుగుతారు ప్రేక్షకులు. క్లైమాక్స్ రొటీన్ అని చెప్పాలి. ఫోర్స్డ్ సీన్స్ అడుగడుకీ కనపడతాయి.
టెక్నికల్ గా చూస్తే ఈ సినిమా కథే బోరింగ్ గా, రొటీన్ గా అనిపిస్తుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలని బాగా తెరపై చూపించడాడు. ఇలాంటివన్నీ పేపర్లో, టీవీల్లో చాలా సార్లు చూసినవే. అలాగే సీరియస్ స్టోరీలో కాస్త కామెడీ ఉన్నా.. కలిసి రాలేదు. దాంతో మిగతా డిపార్టమెంట్ లు ఎంత కష్టపడినా వాళ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది.ఎ.డిటింగ్ లోపం ల్యాగ్ అనిపిస్తుంది.
నటీనటుల్లో .. అల్లరి నరేశ్ ఎలక్షన్ అధికారిగా తన విధిని బాధ్యతగా నిర్వహించే పాత్రలో చక్కగా నటించాడు. కానీ ప్రత్యేకత అయితే ఏమీ లేదు. ఇక హీరోయిన్ గా నటించిన ఆనంది తన పాత్రకు న్యాయం చేసింది. అయితే గిరిజన యువతిగా … మాములుగా కనిపించడం చిత్రంగా అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ ఈ సినిమాలో ఇంగ్లీష్ టీచర్ పాత్రలో తన క్యారెక్టర్ లో బాగా చేశాడు. గిరిజన నాయకుడిగా నటించిన శ్రీతేజ్ ,కలెక్టర్ గా సంపత్ రాజ్, ఊరి ప్రజల నుంచి తక్కువ రేటుకే సరుకులు కొనే వ్యాపారి పాత్రలో రఘుబాబు న్యాయం చేశారు.
చూడచ్చా
సందేశాత్మక చిత్రాలు ఈ మధ్యకాలంలో బాగా మిస్సవుతున్నాం అని ఫీలయ్యేవారు ఓ లుక్కేయచ్చు
నటీనటులు : ‘అల్లరి’ నరేష్, ఆనంది, ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్, సంపత్ రాజ్, శ్రీతేజ్, కామాక్షి భాస్కర్ల, కుమనన్ సేతురామన్ తదితరులు
మాటలు : అబ్బూరి రవి
ఛాయాగ్రహణం : రామ్ రెడ్డి
సంగీతం : శ్రీచరణ్ పాకాల
నిర్మాణ సంస్థలు: హాస్య మూవీస్, జీ స్టూడియోస్
నిర్మాత : రాజేష్ దండా
రచన, దర్శకత్వం : ఏఆర్ మోహన్
విడుదల తేదీ: నవంబర్ 25, 2022