ఆపరేషన్‌ గోల్డ్‌ఫిష్‌ మూవీ రివ్యూ

Published On: October 19, 2019   |   Posted By:
ఆపరేషన్‌ గోల్డ్‌ఫిష్‌ మూవీ రివ్యూ
 
ఆపరేషన్ ఫినిష్ (ఆపరేషన్‌ గోల్డ్‌ఫిష్‌ రివ్యూ)
Rating:2/5

గూఢచారి, బందోబస్తు, వార్, చాణక్య అంటూ వరసపెట్టి టెర్రిరిజం, ఐఎస్ ఐ, రా ఏజెంట్స్, ఎన్.ఎస్.జి కమాండో లు చుట్టూ తిరిగే కథల సీజన్ మొదలైంది. సంసారపక్షమైన కథలతో కాలక్షేపం కన్నా దేశ భక్తి..దేశ రక్షణ వంటివాటితో సినిమాలు తీస్తే నాలుగు చోట్ల ఆడి నాలుగు రూపాయిలు వస్తాయని నమ్ముతున్నారు.  ఈ ఊపులో ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అంటూ ఓ దేశభక్తి మిళితమైన టెర్రరిజం సబ్జెక్ట్ ని ధియోటర్ లో దించారు. మరి ఈ సినిమా దేశభక్తిని మనలో నింపిందా…ఓపినింగ్స్ సరిగ్గా రప్పించుకోలేకపోయన ఈ చిత్రం నిలబడుతుందా..అసలు కథేంటి, ఈ ఆపరేషన్ ..రేషన్ ఏంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
 

స్టోరీ లైన్

టెర్రరిస్ట్ నాయకుడు  ఘాజీ బాబా (అబ్బూరి రవి) అరాచకాలకి అంతే ఉండదు.   కశ్మీర్ పండిట్లను ఘాజీ బాబా(అబ్బూరి రవి) కశ్మీర్ ని వదిలి వెళ్లిపోవాలని అతి దారుణంగా చంపేస్తాడు. ఆ క్రమంలో … అతని చేతిలో అర్జున్ పండిట్ (ఆది సాయి కుమార్) తల్లిదండ్రులు బలైపోతారు. దాంతో ఎప్పటికైనా ఘాజీ బాబా అంతుచూడాలని,  చిన్నప్పటి నుండే కసి పెంచుకుని ఎన్.ఎస్.జి కమాండోగా అవుతాడు అర్జున్.  మొత్తానికి  ఓ స్కెచ్ వేసి ఘాజీ బాబాని చేసి పట్టుకుని ఉరికంబం ఎక్కించబోతాడు. అయితే ఘాజీని విడిపించుకోవడానికి అతని ప్రధాన అనుచరుడు ఫారూఖ్ (మనోజ్ నందం) రెడీ అవుతాడు.  సెంట్రల్ మినిష్టర్ శర్మ (రావు రమేష్) కూతురు నిత్యను కిడ్నాప్ ప్లాన్ చేస్తాడు. ఈ విషయం తెలిసిన అర్జున్ … ఫారూఖ్ ని ఆపడానికి ఏమి చేశాడు? చివరకి ఘాజీ పై తన పగ తీర్చుకున్నాడా? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 

ఫెయిలైన ప్రయాస…

కూనిరాగం కు కాపీరాగం కలిస్తే  ఏమౌతుంది..ఖూనీ రాగం రెడీ అవుతుంది…అదే ఈ సినిమాకు జరిగింది.  ఆ మధ్యన బాలీవుడ్ లో షారూఖ్ బాద్షా గా వెలుగుతున్న రోజుల్లో వచ్చిన మైహూనా వంటి ఎంటర్టైన్మెంట్ సినిమాకు, పార్లమెంట్‌పై దాడి కేసులో ఉరి పడ్డ అప్జల్ గురు ఎలిమెంట్ కు లింక్ కలిపి గోల్డ్ ఫిష్ అంటూ, కాశ్మీర్ పండిట్స్ అంటూ కొత్త కలర్ ఇవ్వబోయారు. అంతేకాదు హీరోకు పగ, ప్రతీకారం అనే ఎలిమెంట్స్ కూర్చారు. అలా కాకుండా  దేశభక్తి అనే పాయింట్ పై వెళ్ళినా బాగుండేది. అంతేకానీ తన తల్లి తండ్రులను చంపినవాళ్లపై పగ పెంచుకుని చంపాలనే వారిని దేశభక్తి అనే పాయింట్ లో ఎలా చూడగలం.

ఓపినింగ్సే సరిగ్గా తెచ్చుకోని ఈ సినిమా ఆ తర్వాత మౌత్ టాక్ ఇలాంటి కాక్ టయిల్ కథతో పుడుతుందనుకోవటం అడవి సాయి కిరణ్ వంటి దర్శకుడు ఆశించటం ఆశ్చర్యమే. అక్కడక్కడా కొన్ని ఎలిమెంట్స్ తప్పిస్తే  ఎక్కడా ఆసక్తికరంగా మలచలేకపోయిన ఈ ఆపరేషన్ ఫెయిలైందని అర్దమవుతుంది. వాస్తవానికి ఈ సినిమా హీరో ఆదికు, దర్శకుడు అడవి సాయి కుమార్ కెరీర్ లకు హిట్ కోసం చేపట్టిన ఆపరేషన్ లాంటింది. అయితే ఈ ఆపరేషన్ ఆదిలోనే దారితప్పటంతో ఆఖరి దాకా చూడటం అనేది అనంతమైన ప్రయాసగా మిగిలింది.
 
ఏ డిపార్టమెంట్ ఎలా

మొదటగా ఈ చిత్రం కథా విభాగంలోనే ఫెయిలైంది. దానికి సమకూర్చిన స్క్రీన్ ప్లే కూడా అంతే నీరసంగా ఉంది. దాంతో ఆ కథ,కథనాలకు తగినట్లుగా డైలాగులు మరింత పేలవంగా తయారయ్యాయి. ఇవన్ని సినిమాలో నటించే ఆర్టిస్ట్ లపై ఇంపాక్ట్ చూపించాయి. ఆది సాయికుమార్ తన సీరియస్ నటనతో ఇంప్రెస్ చేయాలని చూసాడు కానీ అతనికంటూ ప్రత్యేకమైన అభిమాన వర్గం లేకపోవటంతో అది వృధానే. అలాగే విలన్ గా ఘాజీబాబాగా అబ్బూరి రవి..చూపులుకు బాగున్నాడు కానీ నటనా పరంగా తేలిపోయాడు. సినిమా మొత్తానికి కీలకమైన ఈ పాత్ర కథనే తినేసింది. దర్శకుడుగా అడవి సాయి కిరణ్ సోసోగా లాగించాడు. వినాయికుడు సినిమా నాటి మ్యాజిక్ మాయిమైపోయింది అనిపిస్తుంది.

టెక్నికల్ గా ..  సినిమాటోగ్రఫీ మిగతా క్రాప్ట్  లతో పోలిస్తే హైలెట్ ఈ సినిమాకే హైలెట్ . ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉండాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా చోట్ల సౌండ్ పొల్యూషన్ గా మారింది.ప్రొడక్షన్ వ్యాల్యూస్ పెద్దగా లేవు. కథ డిమాండ్ చేసే డబ్బు అయితే ఖర్చు పెట్టలేదని అర్దమవుతుంది..
 
చూడచ్చా
పనిగట్టుకుని మరీ వెళ్లి చూసేటంత సినిమాలేదు.
 

తెర ముందు..వెనక

నటీనటులు: ఆది, సాషా చెత్రి, అనీష్‌ కురువిల్లా, మనోజ్‌ నందన్‌, అబ్బూరి రవి, కార్తీక్‌ రాజు, పార్వతీశం, నిత్య నరేష్‌, కృష్ణుడు, రావు రమేశ్‌ తదితరులు
సంగీతం: శ్రీచరణ్‌ పాకాల
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
సినిమాటోగ్రాఫర్‌: జైపాల్ రెడ్డి
కూర్పు: గ్యారీ బీహెచ్‌
నిర్మాతలు: ప్రతిభ అడవి, కేశవ్‌ ఉమా స్వరూప్‌, పద్మనాభరెడ్డి
దర్శకుడు: అడవి సాయికిరణ్‌