ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డ్స్ 2024 కర్టెన్ రైజర్

Published On: March 6, 2024   |   Posted By:

ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డ్స్ 2024 కర్టెన్ రైజర్

ఎంతో మంది గొప్ప నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శక నిర్మాతలు తెలుగు సినిమా ఘనతను ప్రపంచానికి చాటారు. అలాంటి వారిని గౌరవించుకునే ప్రయత్నం చేస్తోంది ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డ్స్ కార్యక్రమం. తెలుగు ఫిల్మ్ అండ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరమ్ నుంచి నాగబాల సురేష్ ఆధ్వర్యంలో ఈ అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ అవార్డ్స్ కార్యక్రమానికి విజన్ వివికె హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత విజయ్ కుమార్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నారు. జ్యూరీ ఛైర్మన్ గా తమ్మారెడ్డి భరద్వాజ బాధ్యతలు తీసుకున్నారు. ఈ నెల 16వ తేదీన హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డ్స్ కార్యక్రమం జరగనుంది. ఇవాళ ఫిలిం ఛాంబర్ లో ఈ అవార్డ్స్ కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ దర్శకులు రేలంగి నరసింహారావు, నిర్మాత ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా

విజన్ వివికె హౌసింగ్ సంస్థ అధినేత విజయ్ కుమార్ మాట్లాడుతూ  ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి ఇలా…ఎంతోమంది గొప్ప నటులు, మరెందరో గొప్ప దర్శక నిర్మాతలు తెలుగు సినిమా ఘనతను ప్రపంచానికి చాటారు. అలాంటి గొప్ప వాళ్లను గౌరవించుకునేందుకు ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించడం, ఆ కార్యక్రమ స్పాన్సర్ షిప్ మాకు దక్కడం సంతోషంగా ఉంది. నాగబాల సురేష్ గారు ఈ కార్యక్రమ బాధ్యతలు తీసుకున్నారు. పెద్దలు భరద్వాజ గారు జ్యూరీ ఛైర్మన్ గా ఉన్నందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్తున్నాం. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేసిన గొప్ప వారికి మార్చి 16న ప్రసాద్ ల్యాబ్స్ లో అవార్డ్స్ అందజేస్తాం. మీరంతా తప్పకుండా రావాల్సిందిగా కోరుతున్నాం. అన్నారు.

తెలుగు ఫిల్మ్ అండ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరమ్ నుంచి నాగబాల సురేష్ మాట్లాడుతూ  ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డ్స్ కార్యక్రమం స్పాన్సర్ విజయ్ కుమార్ గారికి, జ్యూరీ ఛైర్మన్ గా ఉన్న భరద్వాజ గారికి కృతజ్ఞతలు. ఇవాళ మన సినిమా ఇండస్ట్రీ ఆదాయం ఏటా 12 వేల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇందులో 3500 కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తున్నాం. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చిత్ర పరిశ్రమకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రయాణం ప్రారంభమై 92 ఏళ్లు అవుతోంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో 24 విభాగాల నుంచి వేలాది మంది లెజెండ్స్ ఈ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేశారు. అలాంటి గొప్పవారిని గుర్తుంచుకుని గౌరవించుకునేందుకే ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డ్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అన్నారు.

దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ  ఈ అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించడం వెనుక గొప్ప లక్ష్యం ఉందని నాకు అనిపించింది. అందుకే జ్యూరీ ఛైర్మన్ గా ఉండేందుకు ఒప్పుకున్నాను. నాగబాల సురేష్ మంచి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే విజయ్ కుమార్ గారు స్పాన్సర్ గా ఓ మంచి కార్యక్రమం నిర్వహించేందుకు ముందుకొచ్చారు. తెలుగు సినిమా 75 ఏళ్ల కార్యక్రమం మనం ఘనంగా నిర్వహించుకున్నాం. అప్పుడు సినిమా ఇండస్ట్రీలోని ప్రతి విభాగం వారు కష్టపడి గ్రాండ్ గా ఆ కార్యక్రమం చేశాం. అప్పుడు కార్యక్రమంలో పాల్గొన్న వారిలో చాలా మంది ఇప్పుడు లేరు. తెలుగు సినిమా వందేళ్ల పండుగకు ఇంకా 8 ఏళ్లు ఉంది. అప్పటి వరకు ఎంతమంది బతికి ఉంటారో తెలియదు. అప్పటివరకు ఆగేకంటే ఆ లోగా ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డ్స్ కార్యక్రమం వంటి ఈవెంట్ చేయడం ఎంతైనా అవసరం. ఈ అవార్డ్స్ ఇచ్చి అన్ని క్రాఫ్ట్స్ లోని సీనియర్స్ ను గౌరవించబోతున్నాం. ఈ అవార్డ్స్ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్, ఇతర యూనియన్స్ అన్నీ కృషి చేయాలని కోరుతున్నా. అన్నారు.

నటి దివ్యవాణి మాట్లాడుతూ  ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డ్స్ కార్యక్రమంలో నేను భాగమవడం సంతోషంగా ఉంది. మరుగున పడిన ఎంతమంది గొప్ప కళాకారులను గుర్తించి వారికి గౌరవించేందుకు చేస్తున్న ఈ ప్రయత్నం సఫలం కావాలి. అలాగే భవిష్యత్ లో ఈ అవార్డ్స్ కార్యక్రమం తెలుగు కే పరిమితం కాకుండా తమిళ, మలయాళ, కన్నడ ఇండస్ట్రీస్ లో కూడా నిర్వహించాలి. అందుకు నా వంతు కృషి చేస్తాను. అన్నారు.

జ్యూరీ సభ్యుడు జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ  ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డ్స్ కార్యక్రమానికి జ్యూరీ మెంబర్ గా ఉన్నందుకు సంతోషిస్తున్నాను. ఇవి మిగతా అవార్డ్స్ లా బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ …అలా ఇవ్వడం లేదు. తెలుగు సినిమా స్మరణీయులు అనుకున్న సీనియర్స్ ను గౌరవించుకుంటూ ఈ అవార్డ్స్ ను అందించబోతున్నాం. ఈ నెల 16న ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగే ఈ కార్యక్రమంలో ఎంతోమంది సినీ పెద్దలు పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగమవ్వాలని కోరుకుంటున్నాం. అన్నారు.