జీ 5 ఒరిజిన‌ల్ సిరీస్ షూట్-అవుట్ ఎట్ ఆలేరు ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల

Published On: August 22, 2020   |   Posted By:

జీ 5 ఒరిజిన‌ల్ సిరీస్ షూట్-అవుట్ ఎట్ ఆలేరు ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల

మెగాస్టార్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ‘జీ 5’ ఒరిజిన‌ల్ సిరీస్ ‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’ ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన సుష్మితా కొణిదెల‌
 
మెగాభిమానులకు ఆగస్టు 22న పెద్ద పండగ. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును వేడుకలా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఏడాది పుట్టినరోజున మెగాస్టార్ పెద్ద కుమార్తె అభిమానులకు ఓ కానుక ఇచ్చారు. ‘జీ 5’ ఓటీటీ కోసం భర్త విష్ణుప్రసాద్‌తో కలిసి నిర్మిస్తున్న వెబ్ సిరీస్ ‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. 
 
స్ఫూర్తివంతమైన ‘లూజర్’ నుండి ‘చదరంగం’, ‘గాడ్ (గాడ్స్ ఆఫ్ ధర్మపురి)’ వరకు బెస్ట్ కంటెంట్‌ను తెలుగు వీక్షకులకు అందించడంలో జీ5 ముందంజలో ఉంది. కామెడీ, మెసేజ్ ఓరియెంటెడ్ ఎంటర్టైన్మెంట్, పొలిటికల్ డ్రామా, స్పోర్ట్స్ డ్రామా, గ్యాంగ్ స్టర్ డ్రామా – డిఫరెంట్ జానర్ సిరీస్‌లు ఈ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ప్రజలకు అందించింది. వీక్షకుల అభిరుచులకు అనుగుణంగా జీ5 కంటెంట్‌ అందిస్తోంది. ఒరిజినల్ వెబ్ సిరీస్ నుండి డైరెక్ట్-టు-ఒటిటి ఫీచర్ ఫిలిమ్స్ వరకూ… ఎన్నో అందిస్తున్న ‘జీ 5’ తెలుగు వీక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది. 
 
‘సైరా నరసింహారెడ్డి’ సహా పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన మెగాస్టార్ చిరంజీవి తనయ సుష్మితా కొణిదెల, ఆమె భర్త విష్ణుప్రసాద్ ‘గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ నిర్మాణ సంస్థను నెలకొల్పారు. నిర్మాతగా డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌/ఓటీటీ రంగంలోకి తొలి అడుగులు వేస్తున్నారు. ‘జీ 5’ అసోసియేష‌న్‌తో ఒక వెబ్ సిరీస్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’ టైటిల్ ఖరారు చేశారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. రెగ్యులర్ మోషన్ పోస్టర్స్ టైపులో కాకుండా స్టోరీ టెల్లింగ్ మోషన్ పోస్టర్ విడుదల చేయడం విశేషం.  
 
ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ప్రధాన పాత్రధారులుగా ఆనంద్ రంగా దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ రూపొందుతోంది. వాస్తవ ఘటనల ఆధారంగా టెర్రరిస్ట్ నేపథ్యంలో 8 ఎపిసోడ్స్‌తో కూడిన ఒక క్రైమ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. ‘ఓయ్’ సినిమా తరవాత ఆనంద్ రంగా దర్శకత్వం వహిస్తున్న సబ్జెక్టు ఇదే. ‘జీ 5’ ఓటీటీలో ఈ సిరీస్ ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది.
 
హైదరాబాద్‌లోని ఓ పోలీస్‌ల, కొంతమంది కరుడుగట్టిన నేరస్తుడి కథల ఆధారంగా వాస్తవ ఘటనల ప్రేరణతో ఈ వెబ్ సిరీస్ రూపొందుతోందని, అదే కాన్సెప్ట్ అని యూనిట్ తెలిపింది.  
 
నిర్మాత శ్రీమతి సుష్మితా కొణిదెల మాట్లాడుతూ ” నేను ప్రొడక్షన్ నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వెబ్ సిరీస్ నా తొలి అడుగు. నాన్నగారి పుట్టినరోజున మా వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. అభిమానులకు ఇది నచ్చిందని అనుకుంటున్నా. మీ మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాను. అత్యంత వీక్షకాదరణ కలిగిన ఓటీటీ వేదిక ‘జీ 5’తో మా గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలో నిర్మిస్తున్న తొలి వెబ్ సిరీస్ కోసం అసోసియేట్ కావడం చాలా సంతోషంగా ఉంది. త్వరలో సిరీస్ విడుదల తేదీ వెల్లడిస్తాం” అని అన్నారు.