ద‌ర్శ‌కుడు మ‌ధుసూధ‌న‌రావు 97వ జ‌యంతి

Published On: June 15, 2020   |   Posted By:
ద‌ర్శ‌కుడు మ‌ధుసూధ‌న‌రావు 97వ జ‌యంతి
 
లెజెండరీ ద‌ర్శ‌కుడు మ‌ధుసూధ‌న‌రావు 97వ జ‌యంతి ఉత్స‌వాలు ‘మా’ కి లక్ష రూపాయల విరాళం
 
ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కుడు.. మ‌ధు ఫిలింఇనిస్టిట్యూట్ అధినేత వి.మ‌ధుసూధ‌న‌రావు 97వ జ‌యంతి సంద‌ర్భంగా ప‌లువురు సినీప్ర‌ముఖులు ఆయ‌న‌ను సంస్మ‌రించుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ద‌ర్శ‌క‌నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌, మా అధ్య‌క్షుడు న‌రేష్, సెక్రటరీ జీవిత రాజ‌శేఖ‌ర్,  ట్రెజరర్ రాజీవ్ క‌న‌కాల‌, ప్ర‌స‌న్న‌కుమార్,  వాణీ మ‌ధుసూద‌న్ , ప్రసాదరావు, సురేష్ కొండేటి త‌దిత‌రులు పాల్గొన్నారు.
 
ద‌ర్శ‌క‌నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాట్లాడుతూ-“మ‌ధుసూద‌న‌రావు గారు ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాలు నిర్మించారు.  ఏఎన్నార్ ఎన్టీఆర్ ల‌తో ప‌ని చేశారు. ఆయ‌న మామూలుగా ద‌ర్శ‌కుడిగానే కాదు మాన‌వ‌తావాదిగానూ పేరు తెచ్చుకున్నారు. చిన్న‌ప్ప‌టి నుంచి ఆయ‌న తెలుసు. ఫ్యామిలీ స్నేహం ఉంది. కానీ ఆయ‌న గురించి మ‌రెన్నో తెలిసాయి. ఆయ‌న ప్ర‌జ‌లు మాన‌వ‌త్వం గురించి ఆలోచించే మ‌నిషి. ఎన్నో సినిమాలు తీసి పెద్ద స‌క్సెస‌య్యారు. ప్ర‌జానాట్య‌మండ‌లిలో ప‌ని చేశారు. హైద‌రాబాద్ లో మ‌ధు ఫిలింఇనిస్టిట్యూట్ ప్రారంబించి ఎంద‌రో న‌టీనటుల్ని త‌యారు చేశారు. మ‌ధుసూద‌న్ గారికి పుట్టిన‌రోజు(జ‌యంతి) శుభాకాంక్ష‌లు“ అని అన్నారు.
 
మూవీ ఆర్టిస్టుల సంఘం అధ్య‌క్షులు నరేష్ మాట్లాడుతూ “ఎంతోమంది నటీనటులతో పాటుగా ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన గొప్ప వ్యక్తి వి మధుసూదన్ రావు గారు. వారి వారసురాలిగా వాణి గారు మధు ఫిలిం ఇనిస్ట్యూట్ ద్వారా  టాలెంట్ ఉన్న వారిని ప్రోత్సహివస్తున్నారు. ఈ లాక్ డౌన్ టైం లో తమ వంతు సహాయంగా లక్ష రూపాయలు విరాళం అందించిన వాణి గారికి ఆ కుటుంబ సభ్యులకి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అన్నారు
 
జీవిత రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ-“బి.మ‌ధుసూధ‌న‌రావు గారి ఇంటిపేరు వీర‌మాచినేని. ఆయ‌న ఇంటిపేరే విక్ట‌రీ అయ్యింది. ఆయ‌న సినిమా తీస్తూ ప్ర‌జ‌ల‌కు మంచి చెప్పాల‌న్న ఆలోచ‌న చేసేవారు. ఆయ‌న చేసిన ప్ర‌తి సినిమాలో చ‌క్క‌ని సందేశం ఉండేది“ అన్నారు.
 
రాజీవ్ క‌న‌కాల మాట్లాడుతూ.. “మొద‌టిసారి హైద‌రాబాద్ ఏపీలో ఫిలింఇనిస్టిట్యూట్ ప్రారంభ‌మైంది. రామారావుగారు ఓపెన్ చేసిన తొలి ఫిలింఇనిస్టిట్యూట్. ఆ ఇనిస్టిట్యూష‌న్ లోనే నాన్న‌గారు ఫౌండ‌ర్ ప్రిన్సిప‌ల్ గా ప‌ని చేశారు. ఆ ఇనిస్టిట్యూట్ తో గొప్ప అనుబంధం ఉంది. అలాంటి గొప్ప ద‌ర్శ‌కుడి గురించి మాట్లాడే అవ‌కాశం అదృష్టం ద‌క్కినందుకు అదృష్టంగా భావిస్తున్నా. మ‌ధు గారి 97వ పుట్టిన‌రోజు ఇది. వందో పుట్టిన‌రోజు ఇలానే ఘ‌నంగా జ‌రుపుకుంటామ‌ని ఆశిస్తున్నాను“ అన్నారు. 
 
వి.మ‌ధుసూద‌న రావు కుమార్తె వాణీ మాట్లాడుతూ-“నాన్న‌గారు ప‌రిశ్ర‌మ‌కు ఏదో ఒక‌టి చేయాల‌ని అనుకునేవారు. మ‌ద్రాసు నుంచే ఆర్టిస్టుల్ని తెచ్చుకోవాలా? అన్న ప‌ట్టుద‌ల‌తో ఇక్క‌డ ఇనిస్టిట్యూట్ ప్రారంభించారు. విద్యార్థుల‌తోనే ఇనిస్టిట్యూట్ సంద‌డిగా ఉండేది. ఇప్ప‌టికీ ఆ వేడుక క‌నిపిస్తోంది. ఆయ‌న‌ ఆత్మ ఇంకా ఇండ‌స్ట్రీ కోసం త‌ప‌న ప‌డుతోంది“ అని అన్నారు.
 
ఈ కార్యక్రమంలో ప్రసన్న కుమార్ కూడా ప్రసంగించారు.