నట రత్నాలు మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్

Published On: June 22, 2023   |   Posted By:

నట రత్నాలు మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్

నట రత్నాలు ఆడియో ఫంక్షన్‌లో సుమన్‌పై శివనాగు ఫైర్‌!

సుదర్శన్‌, రంగస్థలం మహేశ్‌, అర్జున్‌ తేజ్‌ కీలక పాత్రధారులుగా నర్రా శివనాగు దర్శకత్వం వహిస్తున్న చిత్రం నట రత్నాలు. ఇనయా సుల్తాన కథానాయిక. మర్డర్‌ మిస్టరీ క్రైం థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎవరెస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డా.దివ్య, సుప్రీం బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేదిక బుధవారం హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ మాజీ ఎంఎల్‌ఎ ఎరపతినేని శ్రీనివాసరావు ఆడియో సీడీలను ఆవిష్కరించారు. దివ్యవాణి, డా. పద్మ, చికోటి ప్రవీణ్‌ తదితరలులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో నేను కొన్ని ఆడియో ఫంక్షన్‌లకు వచ్చా. కర్నూల్‌లో జరిగిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు చిత్రం వేడుక కర్నూల్‌లో జరిగినప్పుడు లక్షమందికి పైగా హాజరయ్యారు. కానీ ఆ సినిమా నాకు నచ్చలేదు. సమర సింహారెడ్డి, నరసింహనాయుడు, మిర్చి తరహా చిత్రాలంటే నాకు ఇష్టం. ఈ చిత్రం బాగా నడుస్తుందని భావిస్తున్నా. చిత్ర బృందాన్ని నా శుభాకాంక్షలు. నా బయోపిక్‌ ఎలక్షన్ల ముందుకు కాదు తర్వాత రావాలని చెప్పా. బాహుబలి రేంజ్‌ బడ్జెట్‌తో ఆ సినిమా ఉంటుంది అని అన్నారు.

చికోటి ప్రవీణ్‌ మాట్లాడుతూ చిన్న సినిమాతోనే పరిశ్రమ మనుగడ ఉంది. ప్రస్తుతం మినిమమ్‌ బడ్జెట్‌ చిత్రాలు ఇండస్ట్రీకి నాలుగో స్తంభంగా నిలుస్తున్నాయి. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా అని అన్నారు.

డా. పద్మ మాట్లాడుతూ నిర్మాతకు తొలి చిత్రమిది. పాటలు బావున్నాయి. దర్శకుడి ప్యాషన్‌ నాకు నచ్చింది. ఇలాంటి చిత్రాలు విజయం సాధిస్తే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి. ఈ చిత్రానికి పని చేసిన అందరికీ మంచి పేరు రావాలి అని అన్నారు.

సుప్రీంబాబు మాట్లాడుతూ మేమంతా అమెరికాలో ఉంటాం. మా నాన్న ఇక్కడే ఉండి సినిమాలు చేసుకుంటా అన్నాడు. మా నాన్నకు సినిమా అంటే ప్యాషన్‌. వృత్తి రీత్యా నేను డాక్టర్‌ని. ఇప్పుడు ఆయన కోసం ఇక్కడే ఉంటా. మంచి సినిమా తీశారు. చక్కని విజయం సాధిస్తుంది అని అన్నారు.

రవికుమార్‌ చౌదరి మాట్లాడుతూ దర్శకుడు శివనాగు వన్‌ మెన్‌ ఆర్మీలాంటి వాడు. అతను ఎప్పుడు మంచి చిత్రాలే తీస్తాడు అని అన్నారు.

దర్శకుడు శివనాగు మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటారు. నేను అవన్నీ దాటుకొచ్చిన వాడినే. అలాంటి ఇతివృత్తంతో తీసిన సినిమా ఇది. మంచి విజయం సాధిస్తుంది. నేను 14 చిత్రాలు తీశా. ఏ సినిమా వల్ల నా నిర్మాతకు నష్టంరాలేదు. చాలా వరకూ నాకు సహకరిస్తారు. ఈ మధ్యకాలంలో చిన్న సినిమా ఫంక్షన్‌లకు ఎవరూ సహకరించట్లేదు. నేను గతంలో మూడు సినిమాలు తీసిన ఓ హీరోని ఈ వేడుకకు ఆహ్వానించా. ఆ వ్యక్తికి ఫోన్‌ చేస్తే అసిస్టెంట్‌తో మాట్లాడమని చెప్పారు. పది రోజులు సాగదీసి ఆయన మేకప్‌మెన్‌ ఫోన్‌ ఎత్తి శివనాగు గారు రెండు లక్షలు ఇస్తే ఆడియో ఫంక్షన్‌కి వస్తారట అండీ అని చెప్పాడు. అంటే ఆడియో రిలీజ్‌ చేయాలంటే రెండు లక్షలు ఇవ్వాలా? డబ్బిచ్చి పొగడాలా? ఆ నటుడు ఎవరో కాదు. సీనియర్‌ నటుడు సుమన్‌. ఏ హీరోనైనా దర్శకుడే తయారు చేస్తారు. సుమన్‌గారి తీరు చూశాక నా బాధ కలిగింది. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో పరిశ్రమ ఉంది అని మండిపడ్డారు.

నిర్మాత దివ్య మాట్లాడుతూ సినిమా బాగా వచ్చింది. త్వరలో విడుదల చేస్తాం అని అన్నారు.

నటీనటులు:

అర్చన, శృతిలయ, సుమన్ శెట్టి, టైగర్ శేషాద్రి, చంటి, అట్లూరి ప్రసాద్, ఖమ్మం సత్యానారాయణ, సూర్య కిరణ్, ఎంఎన్ఆర్ చౌదరి, నల్లమల రంజిత్ కుమార్, ఖమ్మం రవి, షైనీ, శాటిలైట్ అమరేంద్ర, మాస్టర్ రిత్విక్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సాంకేతికవర్గం :

డీఓపీ: గిరి కుమార్
లిరిక్స్: సీతారామ చౌదరి
ఎడిటర్: ఆవుల వెంకటేష్సంగీతం: శంకర్ మహాదేవ్
నిర్మాతలు: డా దివ్య, వై. చంటి, ఆనంద్ దాస్ శ్రీ మణికంఠ,
దర్శకత్వం: శివనాగు