పిండం చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్

Published On: October 30, 2023   |   Posted By:

పిండం చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్

కంటెంట్ ని నమ్ముకొని తీసిన చిత్రం పిండం – హీరో శ్రీరామ్
పిండం చిత్రం టీజర్ ను అభినందించిన చిత్ర ప్రముఖులు చిత్ర ప్రముఖుల సమక్షంలో పిండం టీజర్ విడుదల వేడుక

ప్రముఖ హీరో శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటిస్తున్న చిత్రం పిండం. ది స్కేరియస్ట్ ఫిల్మ్ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఇటీవల మేకర్స్ పిండం ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయగా, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడు ఈ చిత్రం నుండి టీజర్ విడుదలైంది. ఈరోజు(అక్టోబర్ 30) ఉదయం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో టీజర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. చిత్ర బృందంతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు శ్రీరామ్ మాట్లాడుతూ, దీనికి ముందు నాలుగు సినిమాలు స్టార్ట్ చేశాం. అవన్నీ ఇంకా పూర్తి కాలేదు. కానీ రెండే నెలల్లో ఈ సినిమా పూర్తయింది. కరెక్ట్ గా మొదలై, కరెక్ట్ గా పూర్తయింది. మన మనస్సు మంచిదైతే అంతా మంచే జరుగుతుంది. ఇంత మంచి నిర్మాతలను నా జీవితంలో చూడలేదు. మా డైరెక్టర్ సాయి కిరణ్ గారు చాలా క్లారిటీ ఉన్న మనిషి. ఏం కావాలో స్పష్టంగా తెలుసు. ఈ సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది. ఎప్పుడు మొదలైందో, ఎప్పుడు పూర్తయిందో తెలియనంతగా షూటింగ్ సరదాగా సాగిపోయింది. ఈ సినిమాలో నటించిన ఇద్దరు పిల్లలు రియల్ సూపర్ స్టార్స్. ఒక నటుడిగా వాళ్ళ నటన చూసి నేనే ఆశ్చర్యపోయాను. నటీనటులు గానీ, సాంకేతిక నిపుణులు గానీ ఈ టీమ్ అందరితో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. ది స్కేరియస్ట్ ఫిల్మ్ అని చెప్పడం వల్ల భయపడి సినిమాకి రాకుండా ఉండకండి. ఏంటి మమ్మల్ని భయపడతారా అనుకొని సినిమాకి రండి. ఖచ్చితంగా సినిమా మిమ్మల్ని అలరిస్తుంది. అనవసరమైన పాటలు, రొమాన్స్, డబుల్ మీనింగ్ డైలాగులు ఉండవు. కంటెంట్ ని నమ్ముకొని తీసిన చిత్రమిది. ఇలాంటి మంచి టీమ్ గెలవాలి. ఇలాంటి మంచి సినిమాని మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అన్నారు.

ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ, సినిమా తీయడానికే భయపడుతున్న ఈ రోజుల్లో భయపెట్టే సినిమా తీశాడు సాయి. ముందుగా దానికి మెచ్చుకోవాలి. సాయి ఎంతో ప్రతిభావంతుడు. ఐటీ జాబ్ చేస్తూ, సినిమా మీద ఇష్టంతో ఇక్కడికి వచ్చాడు. 2020 లో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా మా బ్యానర్ లోనే దర్శకుడిగా పరిచయం కావాల్సి ఉంది. అది అమెరికాలో చిత్రీకరణ జరుపుకోవాల్సి ఉండగా, కోవిడ్ కారణంగా వీసాలు రాలేదు. ఆ తర్వాత సిద్ధు డీజే టిల్లు తో బిజీ అయ్యాడు. ఇంతలో సాయి ఈ సినిమా చేసుకొని వస్తా అన్నాడు. ఇలాంటి ప్రతిభావంతులు పరిశ్రమకి కావాలి. అప్పుడే వైవిధ్యమైన సినిమాలు వస్తాయి. పిండం అనేది జననానికి, మరణానికి సంబంధించినది. ఈ పిండం సాయి కిరణ్ లాంటి ప్రతిభగల దర్శకుడి పుట్టుకకు కారణం అవ్వాలని కోరుకుంటున్నాను. సాయి కిరణ్ టాలెంట్ త్వరలో ప్రపంచం చూడబోతుంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.

ప్రముఖ రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి మాట్లాడుతూ,  హారర్ జానర్ లో సినిమా తీద్దాం అనుకోవడంతోనే నిర్మాతలు సగం విజయం సాధించారు. హారర్ సినిమాల వల్ల అన్ని విభాగాలు తమ పనితనాన్ని చూపించుకోవచ్చు. అయితే మామూలుగా హారర్ సినిమాల్లో దెయ్యంగా ఎందుకు మారింది అనేది చివరిలో ఓ రెగ్యులర్ ఫార్మాట్ లో చెప్తారు. కానీ దీనిని పిండం అనే టైటిల్ పెట్టడం వల్ల, ఇది రెగ్యులర్ హారర్ ఫిల్మ్ కాదు అనిపిస్తోంది. చావుకి, పుట్టుకకి వారధి లాంటిది ఈ కథ, వెంటనే చూడాలి అనే ఆసక్తి కలుగుతోంది. ఈ సినిమాలో ఎందరో ప్రతిభగల నటీనటులు ఉన్నారు. టీజర్ బాగుంది, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. అన్నారు.

చిత్ర నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి మాట్లాడుతూ, కళాహి మీడియా బ్యానర్‌పై ఇది మా మొదటి సినిమా. చాలా రోజుల నుంచి ప్రేక్షకులకు ఓ మంచి సినిమా అందించాలని ఎంతో హోంవర్క్ చేశాము. అలాంటి వర్క్ లో నుంచి వచ్చినదే పిండం. కళాహి మీడియా బ్యానర్‌పై ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని చేస్తాం. ఇక నుంచి మా బ్యానర్ పేరు వింటూనే ఉంటారు. పిండం సినిమా గురించి చెప్పాలంటే డైరెక్టర్ గారు ఎలాంటి సోది లేకుండా చాలా కాన్ఫిడెంట్ గా హారర్ మూవీ అంటే హారర్ మూవీ లాగా చూపించారు. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రతిభగల నటీనటులు, సాంకేతిక నిపుణులు దొరకడం వల్లే సినిమాని ఇంత త్వరగా, ఇంత బాగా తీయగలిగాం. అన్నారు.

చిత్ర దర్శకుడు సాయి కిరణ్ మాట్లాడుతూ,  పిండం అనే కథ ఎలా మొదలైంది అంటే ఒకసారి మా అమ్మమ్మ ఊరిలో జరిగిన ఓ క్రూరమైన ఘటన గురించి చెప్పారు. అది నా మైండ్ లో అలాగే ఉండిపోయింది. దానిని ఎలా చెప్పాలి అని ఆలోచిస్తే హారర్ జానర్ చెప్తే బాగుంటుంది అనిపించింది. ఆ ఘటన చుట్టూ హారర్ జానర్ కి తగ్గట్టు కథ అల్లుకొని రాయడం జరిగింది. ఇదొక ఇంటెన్స్ హారర్ ఫిల్మ్. స్క్రీన్ ప్లే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాకి పిండం అనే టైటిల్ ఎందుకు పెట్టారని చాలామంది అడుగుతున్నారు. సినిమా చూశాక ఈ కథకి ఇదే సరైన టైటిల్ అని మీరే అంటారు. పిండం అనేది నెగటివ్ టైటిల్ కాదు. మనిషి ఆరంభం, అంతం రెండూ దానితో ముడిపడి ఉంటాయి. నటీనటులు, సాంకేతిక నిపుణుల అందరి సహకారంతో ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. ఈ సినిమాని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అన్నారు.

ప్రముఖ నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ గురించి తెలిసినప్పుడు, సాయి కిరణ్ గారు చేసిన షార్ట్ ఫిల్మ్ చూశాను. చాలా నచ్చింది. అది చూసి నేను సాయి కిరణ్ గారితో వర్క్ చేయాలి అనుకున్నాను. దర్శకుడు, నిర్మాత కలిసి ఒక టీమ్ గా పనిచేస్తేనే మంచి సినిమా వస్తుంది. ఈ సినిమా విషయంలో అదే జరిగింది. కళాహి మీడియా ముందు ముందు మరిన్ని సినిమా నిర్మించాలని కోరుకుంటున్నాను. అన్నారు.

చిత్ర కథానాయిక ఖుషీ రవి మాట్లాడుతూ,  తెలుగులో సినిమా చేయడం సంతోషంగా ఉంది. నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. శ్రీరామ్ గారు అద్భుతమైన నటుడు, మంచి మనసున్న వ్యక్తి. ఈ టీమ్ తో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. అన్నారు.

ది స్కేరియస్ట్ ఫిల్మ్ అనే ఉప శీర్షికకు తగ్గట్టుగానే పిండం టీజర్ సాగింది. ఇది అన్ని కుక్కల్లా లేదు. ఇదేదో వేరే జంతువులా ఉంది. దీనిని వెంటనే పూడ్చి పెట్టండి. లేదంటే ఈ ఊరికే ప్రమాదం అంటూ ఈశ్వరీ రావు చెప్పే మాటతో టీజర్ ప్రారంభమైంది. ఈశ్వరీ రావు ఒక ఇంటిలోకి వెళ్ళి ఆత్మ ఆవహించిన అమ్మాయితో మాట్లాడుతుంది. ఆ తర్వాత మీ కెరీర్ లో మోస్ట్ కాంప్లికేటెడ్ కేస్ ఏదైనా ఉందా? అని అవసరాల శ్రీనివాస్ అడగగా ఉంది. అది చాలా ప్రత్యేకమైనది. దానిని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. మళ్ళీ ఎప్పుడూ ఎక్కడా అటువంటి దాని గురించి వినలేదు. అదొక అపారవంతమైన శక్తి కలిగి ఉన్న ఆత్మ కథ. అంటూ ఈశ్వరీ రావు సమాధానం చెప్తుంది. శ్రీకాంత్ శ్రీరామ్ కుటుంబం నివసిస్తున్న ఇంట్లో అనుకోని ఘటనలు జరుగుతుంటాయి. కుటుంబ సభ్యులంతా చావు భయంతో వణికిపోతుంటారు. అసలు ఆ ఇంట్లో ఉన్న శక్తివంతమైన ఆత్మ ఎవరు? ఆ ఆత్మ కథేంటి? అనే ఉత్కంఠను రేకెత్తిస్తూ టీజర్ ని రూపొందించారు. ఇక కళ్ళకు కనిపించే భౌతిక ప్రపంచం చాలా చిన్నది. దాని సరిహద్దులు మనకు అర్థమవుతాయి. కానీ లోపల ప్రపంచానికి సరిహద్దులు ఉండవు. అది అంత తేలికగా అర్థంకాదు. అని ఈశ్వరీ రావు చెప్పిన మాటతో టీజర్ ను ముగించిన తీరు ఆకట్టుకుంది. అద్భుతమైన విజువల్స్, బీజీఎం తో రూపొందిన ఈ థ్రిల్లింగ్ టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

పిండం అనేది కంప్లీట్ హారర్ చిత్రంగా ఉండబోతుంది. ఇంతటి భయానక హారర్ చిత్రాన్ని టాలీవుడ్ ఇంతవరకూ చూడలేదని చిత్ర బృందం చెబుతోంది. పిండం కథ ప్రస్తుతం అలాగే 1990 మరియు 1930 లలో మూడు కాలక్రమాలలో జరిగేదిగా కనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవనుంది.

తారాగణం :

శ్రీరామ్, ఖుషి రవి, ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ తదితరులు

సాంకేతికవర్గం :

కథ: సాయికిరణ్ దైదా, కవి సిద్ధార్థ
డీఓపీ: సతీష్ మనోహర్
సంగీతం: కృష్ణ సౌరభ్ సూరంపల్లి
ఎడిటర్: శిరీష్ ప్రసాద్
సమర్పణ: ఆరోహి దైదా
నిర్మాత: యశ్వంత్ దగ్గుమాటి