రంగ్ దే చిత్రం తొలి గీతం విడుదల

Published On: November 12, 2020   |   Posted By:

రంగ్ దే చిత్రం తొలి గీతం విడుదల

యూత్ స్టార్ ‘నితిన్, కీర్తి సురేష్‘ ల రొమాంటిక్ మెలోడీ గీతం

యూత్ స్టార్ నితిన్ వివాహ మహోత్సవం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ‘రంగ్ దే‘ చిత్రం నుంచి విడుదల అయిన చిన్న వీడియో దాదాపు 14 మిలియన్స్ పైగా వ్యూస్ సాధించిన అనంతరం చిత్రం నుంచి తొలి గీతాన్ని వీడియో రూపంలో ఈరోజు విడుదల చేసింది చిత్రం యూనిట్.

 ‘ప్రేమ’ తో కూడిన కుటుంబ కధా చిత్రం అయిన ఈ  ‘రంగ్ దే’ లోని గీతం వివరాల్లోకి వెళితే ..
‘ఏమిటో ఇది వివరించలేనిది
మది ఆగమన్నది తనువాగనన్నది
భాష లేని ఊసులాట సాగుతున్నది
అందుకే ఈ మౌనమే ఓ భాష ఐనది
కోరుకోని కోరికేదో తీరుతున్నది‘ అంటూ సాగే ఈ పల్లవి గల గీతానికి శ్రీమణి సాహిత్యం సమకూర్చారు. హరిప్రియ, కపిల్ కపిలన్ ల గాత్రంలో శ్రావ్యంగా వినిపిస్తుంది ఈ గీతం. ప్రసిద్ధ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ గీతానికి అందించిన స్వరాలు సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తాయి.

చిత్ర నాయకా, నాయిక లయిన నితిన్, కీర్తి సురేష్ లపై  రొమాంటిక్ మెలోడీ గీతం గా వెండితెరపై వీక్షకులకు కనువిందు కలిగేలా చిత్రీకరించారు దర్శకుడు వెంకీ అట్లూరి.

ఈ నెల చివరి వారం నుంచి చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు, దుబాయ్ లో పాటలచిత్రీకరణతో కొద్దిరోజులలోనే చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. 2021 సంక్రాంతి  కానుకగా చిత్రం విడుదల అవుతుంది. 

యూత్ స్టార్ ‘నితిన్’, ‘కీర్తి సురేష్’ ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ఈ ‘రంగ్ దే’. ‘ప్రతిభగల యువ దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ గారు ఈ చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తుండగా  ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. 

నితిన్,కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ ‘రంగ్ దే’ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్,రోహిణి, కౌసల్య,బ్రహ్మాజీ,వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి  డి.ఓ.పి.: పి.సి.శ్రీరామ్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కూర్పు: నవీన్ నూలి: కళ: అవినాష్ కొల్లా. అడిషనల్ స్క్రీన్ ప్లే : సతీష్ చంద్ర పాశం.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:  ఎస్.వెంకటరత్నం(వెంకట్).సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.
నిర్మాత:సూర్యదేవర నాగవంశీ. రచన,దర్శకత్వం: వెంకీ అట్లూరి