రాం నాయక్ చిత్రం ప్రారంభం

Published On: March 2, 2020   |   Posted By:

రాం నాయక్ చిత్రం ప్రారంభం


రమేష్ చౌహాన్, శుభాంగి హీరోహీరోయిన్లుగా, శ్రీ తుల్జా భవానీ ఫిల్మ్ సిటీ బ్యానర్‌పై శ్రీమతి లక్ష్మీ చౌహాన్ నిర్మిస్తున్న చిత్రం ‘రాం నాయక్’. కపిల సుబ్బారావు దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు తాజాగా హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు రమేష్ చౌహాన్ మాట్లాడుతూ.. ‘‘బంజారా భాషలో నిర్మింపబడుతున్న ఈ చిత్రంలో మొత్తంగా 5 పాటలు ఉంటాయి. ఈ పాటలన్నీ ప్రేక్షకుల మనసులను ఆకట్టుకునేలా ఉంటాయి. సంగీత దర్శకులు భోలేషావలి ఈ పాటలకు ప్రాణం పోశారు. దర్శకుడు కపిల సుబ్బారావు అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. తప్పకుండా అందరినీ ఆకట్టుకునే చిత్రమవుతుంది..’’ అన్నారు.  

సంగీత దర్శకుడు భోలేషావలి మాట్లాడుతూ.. ‘‘గతంలో సూపర్ హిట్ అయిన బంజారా చిత్రం ‘గోర్ జీవన్’ తర్వాత అంతగా మనసు లగ్నం చేసి ఈ చిత్ర పాటలకు బాణీలను సమకూర్చాను. తప్పకుండా ఈ చిత్రం మ్యూజికల్ హిట్ అవుతుంది. నాకు మంచి పేరు తీసుకువచ్చే చిత్రమవుతుంది..’’ అని అన్నారు.
చిత్ర దర్శకుడు కపిల సుబ్బారావు మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు మార్చి 3 నుంచి ప్రారంభమవుతాయి. మిర్యాలగూడ, నాగార్జునసాగర్ పరిసర ప్రాంతాలలో మొదటి షెడ్యూల్ ప్లాన్ చేశాము. ఈ చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో పాటుగా చక్కని డైలాగులు, అందమైన లొకేషన్లు కూడా ప్రేక్షకులకు ఆనందం కలిగిస్తాయి..’’ అని చెప్పారు.

రమేష్ చౌహాన్, శుభాంగి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జబర్ధస్త్ అప్పారావు, షేకింగ్ శేషు, లక్కింశెట్టి నాగేశ్వరరావు, రైజింగ్ రాజు, బుల్లితెర నటీమణి శ్రావణి తదితరులు ఇతర తారాగణం.

ఈ చిత్రానికి ప్రొడక్షన్ మేనేజర్స్: శంకర్ నాయక్, కండిల వెంకన్న, సూర్య; స్ర్కీన్‌ప్లే-మాటలు: సాయి కౌండిన్య, కెమెరా: శ్రావణ్ కుమార్, డ్యాన్స్: అమ్మ సుధీర్, రాజు; సంగీతం: భోలేషావలి, నిర్మాత: రమేష్ చౌహాన్, దర్శకత్వం: కపిల సుబ్బారావు.