లంబసింగి సినిమా తొలి పాట విడుదల

Published On: April 18, 2022   |   Posted By:

లంబసింగి సినిమా తొలి పాట విడుదల

వేసవిలో సిమ్లా, ఊటీ, కశ్మీర్ వంటి హిల్ స్టేష‌న్స్‌కు టూర్ వేయాలని చాలా మంది అనుకుంటారు! ఎందుకంటే… అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి! ఆంధ్రాలోనూ అటువంటి హిల్ స్టేషన్ ఒకటి ఉంది. ఆంధ్రా కశ్మీర్‌గా పాపులర్ అయ్యింది. అదే ‘లంబసింగి’. ఇప్పుడీ ఊరి పేరుతో ఓ సినిమా రూపొందుతోంది.

‘లంబసింగి’ చిత్రంతో ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆయన సమర్పకులు. భరత్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ… ‘బిగ్ బాస్’ దివి కథానాయికగా కాన్సెప్ట్ ఫిల్మ్స్ పతాకంపై ఆనంద్ తన్నీరు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎ ప్యూర్ లవ్ స్టోరీ… అనేది ఉపశీర్షిక. ఇందులోని తొలి పాట ‘నచ్చేసిందే నచ్చేసిందే…’ను కింగ్ అక్కినేని నాగార్జున విడుదల చేశారు.

రొమాంటిక్ మెలోడీగా రూపొందిన ‘నచ్చేసిందే నచ్చేసిందే…’ పాట అందరికీ ప్రేక్షకులు అందరికీ నచ్చేసింది. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించిన ఈ గీతాన్ని సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ ఆలపించారు.

‘నచ్చేసిందే నచ్చేసిందే…
నాకెంతో నచ్చిందే ఈ పిల్ల
నవ్వేసిందే నవ్వేసిందే…
నా మనసే తవ్వేసిందే ఇలా
చిట్టి గుండె జారి…
మొట్టమొదటిసారి
కొట్టుకోవడం తాను మరచిందేమో’ అంటూ సాగిన ఈ గీతానికి కాస్లర్య శ్యామ్ సాహిత్యం అందించారు.

కింగ్ అక్కినేని నాగార్జున మాట్లాడుతూ “నా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ నిర్మించిన సినిమా ‘లంబసింగి’. ఇందులో ‘బిగ్ బాస్’ దివి కథానాయికగా నటించింది. ఇందులో తొలి పాట ‘నచ్చేసిందే నచ్చేసిందే…’ను వినండి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్” అన్నారు.

దర్శకుడు నవీన్ గాంధీ మాట్లాడుతూ “విశాఖ సమీపంలోని లంబసింగి నేపథ్యంలో రూపొందిన ప్రేమకథా చిత్రమిది. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమలో గాఢతను తెలిపే గీతం ‘నచ్చేసిందే నచ్చేసిందే’. సిద్ శ్రీరామ్ గాత్రం, కాస్లర్య శ్యామ్ సాహిత్యం, ఆర్ఆర్ ధృవన్ సంగీతం నచ్చేశాయని ప్రేక్షకులు చెబుతుంటే సంతోషంగా ఉంది. చిత్రీకరణ అంతా పూర్తయింది. సినిమా అంతా లంబసింగిలో తీశాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం” అని తెలిపారు.

భరత్, దివి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి, నవీన్ రాజ్ సంకరపు, ప్రమోద్, రమణ, పరమేష్, సంధ్య ఇతర తారాగణం.

ఈ చిత్రానికి పీఆర్వో: పులగం చిన్నారాయణ, కూర్పు: కె. విజయ్ వర్ధన్, ఛాయాగ్రహణం: కె. బుజ్జి (BFA), సాహిత్యం: కాసర్ల శ్యామ్, సంగీతం: ఆర్ఆర్ ధృవన్, నిర్మాణం: కాన్సెప్ట్ ఫిల్మ్స్, సమర్పణ: కళ్యాణ్ కృష్ణ కురసాల, కథ – స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం: నవీన్ గాంధీ.