శ్రీ కళాసుధ సిల్వర్ జూబ్లీ ఉగాది పురస్కారాలు

Published On: April 5, 2024   |   Posted By:

శ్రీ కళాసుధ సిల్వర్ జూబ్లీ ఉగాది పురస్కారాలు

ఈ నెల 7న చెన్నైలో ఘనంగా శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ ఉగాది పురస్కారాలు
ఏటా ఉగాది పురస్కారాలు అందిస్తూ చెన్నైలో తెలుగు వారి కీర్తిని చాటుతున్న శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఈ ఏడాది సిల్వర్ జుబ్లీ ఉగాది పురస్కారాలు అందించబోతోంది. ఈ సంస్థ స్థాపించి పాతికేళ్ల అవుతుంది. ఈ నెల 7వ తేదీన చెన్నైలోని మ్యూజిక్ అకాడెమీలో సిల్వర్ జుబ్లీ ఉగాది పురస్కారాల కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమ వివరాలు హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో కమిటీ మెంబర్స్ వివరించారు.
శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు బేతిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ.. చెన్నై మహానగరంలో తెలుగు వారి ఘన కీర్తిని చాటుతూ పాతిక సంవత్సరాలుగా శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఉగాది పురస్కారాలు అందిస్తున్నాం. 1998, నవంబర్ 21వ తేదీన ఈ అవార్డ్స్ ప్రారంభించాం. శ్రీ కళా సుధ  తెలుగు అసోసియేషన్ స్థాపించి ఇరవై ఐదేళ్లు పూర్తయింది. ఉగాదికి రెండు రోజుల ముందే ఈ నెల 7వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి చెన్నై మ్యూజిక్ అకాడెమీలో ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. ఈ సందర్భంగా సావనీర్ రిలీజ్ చేయబోతున్నాం. క్రోధి నామ సంవత్సరం ఉగాది రోజున మహిళా రత్న పురస్కారం, ఒక నటి, దర్శకుడికి బాపు రమణ పేరు మీద బాపుబొమ్మ అవార్డ్ ఇస్తున్నాం. అలాగే నిర్మాత ఆదిత్య రామ్ గారికి విశిష్ట ఉగాది పురస్కారం, రవి ప్రసాద్ యూనిట్ అధినేత చంగయ్య గారికి లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డ్ ఇవ్వబోతున్నాం. జనవరి నుంచి డిసెంబర్ వరకు రిలీజైన తెలుగు సినిమాల్లో మన తెలుగుదనం ఉట్టిపడేలా ఉన్న చిత్రాలకు పురస్కారాలు ఇస్తాం. ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు అతిథిగా పాల్గొంటారు. సభాధ్యక్షుడిగా మండలి బుద్ధ ప్రసాద్ గారు వ్యవహరిస్తారు. అన్నారు.
కమిటీ మెంబర్ పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ.. శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ లో నేను కమిటీ మెంబర్ గా పదేళ్లుగా కొనసాగుతున్నాను. ప్రతి ఏడాది ఉగాదికి ముందు వచ్చే ఆదివారం రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటాం. ఇలా పాతికేళ్లుగా ఈ ఉగాది పురస్కారాలు ఇస్తున్న శ్రీనివాస్ గారు, ఇతర కమిటీ మెంబర్స్ కు అభినందనలు. చెన్నైలోని మ్యూజిక్ అకాడెమీలో ఈ పురస్కారాల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆ వేదిక మీద అవార్డ్ అందుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తుంటారు. శ్రీనివాస్ గారు ఏడాది అంతా చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్స్ లో తెలుగు సినిమాలను అక్కడ ఉన్న తెలుగు వారికీ చూపిస్తూ వాటిలో బాగున్న వాటిని అవార్డ్స్ కోసం సెలెక్ట్ చేస్తుంటారు. ఈ సారి ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వచ్చిన ప్రతి కుటుంబానికి సిల్వర్ కాయిన్ రిటన్ గిఫ్టుగా ఇస్తున్నారు. ప్రసన్నకుమార్ గారు ఈ కార్యక్రమంలో భాగమవడం సంతోషంగా ఉంది. మీరంతా కళాసుధ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నా అన్నారు.
కమిటీ మెంబర్ సౌజన్య మాట్లాడుతూ.. శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ చెన్నై సిల్వర్ జుబ్లీ ఉగాది పురస్కారాల కార్యక్రమానికి తెలంగాణ నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, మండలి బుద్ధ ప్రసాద్ గారు, గానకోకిల సుశీల గారు, ఎస్ బీఐ చెన్నై సర్కిల్ జీఎం ఎంవీఆర్ మురళీకృష్ణ గారు, తానా ఫౌండేషన్ ఛైర్మన్ శశికాంత్ గారు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హాజరవుతారు అన్నారు.
కమిటీ మెంబర్ హేమంత్ మాట్లాడుతూ.. శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ వారు ఇరవై ఐదేళ్లుగా ఉగాది పురస్కారాలు అందించడం గొప్ప విషయం. శ్రీనివాస్ గారి పట్టుదల వల్లే ఇంతమంచి కార్యక్రమం కొనసాగుతోంది. మాకు సపోర్ట్  చేస్తున్న ప్రసన్నకుమార్ గారికి, పర్వతనేని రాంబాబు, కేశవ గార్లకు థ్యాంక్స్. ఇటీవల చెన్నైలో తెలుగు వారి కార్యక్రమాలు తగ్గిపోయాయి. కళాసుధ వారు మాత్రం క్రమం తప్పకుండా ఉగాది పురస్కారాలు అందిస్తూ వస్తున్నారు. మీరంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తున్నాం అన్నారు.
నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ఒకప్పుడు మద్రాసు రాష్ట్రంలోనే మన తెలుగు వాళ్లంతా కలిసి ఉండేవాళ్ళం. పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా విడిపోయింది. అయినా మనకు సాంస్కృతిక రాజధాని మద్రాస్ అనే అనుకోవాలి. కలకత్తాలో సినిమా పుట్టినా అక్కడి నుంచి ముంబై, షోలాపూర్ నుంచి మద్రాసు చేరింది. మద్రాసులో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, ఒరియా సినిమాలు కూడా రూపొందేవి. అలాంటి మద్రాసు నగరంలోని మ్యూజిక్ అకాడెమీలో పాతికేళ్లుగా కళాసుధ అవార్డ్స్ నిర్వహించడం గొప్ప విషయం. ఈ సంస్థ మన సినిమాలకు ఉగాది పురస్కారాలు ఇస్తూ ఎంతో ప్రోత్సాహం అందిస్తోంది.
ఉత్తమ నిర్మతా మైత్రీ మూవీ మేకర్స్, ఉత్తమ సంచలనాత్మక సినిమా భగవంత్ కేసరి, ఉత్తమ జ్యూరీ అవార్డ్ రుద్రంగి, ఉత్తమ నటుడు ధనుష్ (సార్ సినిమాకు), భగవంత్ కేసరికి ఉత్తమ నటిగా శ్రీలీల, భగవంత్ కేసరికి ఉత్తమ దర్శకుడిగా అనిల్ రావిపూడికి ఉగాది పురస్కారాలు ఇవ్వబోతున్నారు. పాతికేళ్లుగా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు కళాసుధ వారికి అభినందనలు. వందేళ్లు ఇలాగే ఉగాది పురస్కారాలు ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.