సినీ రచయిత సి.ఎస్.రావు కన్నుమూత

Published On: April 15, 2020   |   Posted By:
సినీ రచయిత సి.ఎస్.రావు కన్నుమూత
 
సుప్రసిద్ధ సినీ, నవలా, నాటక రచయిత శ్రీ సి.ఎస్.రావు (85) నేడు హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు. 
 
మెగాస్టార్ చిరంజీవి మొదటి చిత్రం ప్రాణం ఖరీదు, కుక్కకాటుకు చెప్పుదెబ్బ, జాతీయ అవార్డు చిత్రం ఊరుమ్మడి బతుకులు, నాయకుడు వినాయకుడు, మల్లెమొగ్గలు వంటి ఎన్నో సినిమాలకు కథలు అందించారు. 
 
ఎంటీయార్ సరదా రాముడు, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో సొమ్మొకడిది సోకొకడిది వంటి చిత్రాల్లో నటించారు. నాటక రంగానికి విశేషమైన సేవ చేసి ఎన్నో అవార్డులని సైతం గెలుచుకున్నారు. ఎందరో నటీనటులకి ఆచార్యులుగా కూడా వ్యవహరించారు. వీరు ప్రస్తుతం చిక్కడపల్లి గీతాంజలి స్కూల్ కరెస్పాండెంట్ గా వ్యవహరిస్తున్నారు. 
 
 
శ్రీ సి.ఎస్.రావుకి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడు సింగపూరులో ఉండడం వల్ల రాలేని పరిస్థితి. లాకౌట్ నియమాలను గౌరవించి ఎవ్వరూ పరామర్శకు వ్యక్తిగతంగా వచ్చే ప్రయత్నం చేయవద్దని కుటుంబ సభ్యులు సినీపరిశ్రమ మిత్రులని, శ్రేయోభిలాషులని కోరారు. బుధవారం హైదరాబాదులోనే అంత్యక్రియలు జరగనున్నాయి.