దర్శక దిగ్గజం దాసరి నేషనల్ అవార్డ్స్
Published On: July 11, 2021 | Posted By: ivs
దర్శక దిగ్గజం దాసరి నేషనల్ అవార్డ్స్
ధవళ సత్యం దర్శకత్వంలో దాసరి బయోపిక్ – తాడివాక రమేష్ నాయుడు ప్రకటన
దర్శక దిగ్గజం దాసరి స్మారకార్ధం “దాసరి నారాయణరావు నేషనల్ ఫిల్మ్ & టివి నేషనల్ అవార్డ్స్” ప్రదానం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ప్రముఖ నిర్మాత తాడివాక రమేష్ నాయుడు. ఇందుకోసం ఆయన ఇప్పటికే “దాసరి నారాయణరావు మెమోరియర్ కల్చరల్ ట్రస్ట్” ఏర్పాటు చేశారు. వివిధ భాషలకు చెందిన కళాకారులు-సాంకేతిక నిపుణులకు జీవన సాఫల్య పురస్కారాలు (లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్) ఇవ్వనున్నారు.
అంతేకాదు. దాసరికి వీరాభిమాని అయిన తాడివాక రమేష్ నాయుడు ప్రముఖ దర్శకుడు ధవళ సత్యం దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో “దాసరి బయోపిక్” నిర్మించేందుకు సైతం సన్నద్ధమవుతున్నారు. ఈ బయోపిక్ పేరు “దర్శకరత్న”. ఇమేజ్ ఫిల్మ్స్ పతాకంపై అతి త్వరలో సెట్స్ కు వెళ్లనున్న “దర్శకరత్న” బయోపిక్ లో ఓ ప్రముఖ హీరో దాసరి పాత్రను పోషించనున్నారు.
ఈ సందర్భంగా ఇమేజ్ ఫిల్మ్స్ అధినేత తాటివాక రమేష్ నాయుడు మాట్లాడుతూ… “నా గురువు, దైవం అయిన దాసరి పేరిట ప్రతి ఏటా ఫిల్మ్ అండ్ టివి నేషనల్ అవార్డ్స్ ఇవ్వాలని సంకల్పం చేస్తున్నాం. అలాగే దాసరికి అత్యంత సన్నిహితులు, ప్రముఖ దర్శకులు అయిన ధవళ సత్యం దర్శకత్వంలో “దర్శకరత్న” పేరుతో దాసరి బయోపిక్ నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ధవళ సత్యం గారు ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారు. స్క్రిప్ట్ అత్యద్భుతంగా వచ్చింది. ఓ ప్రముఖ హీరో ఇందులో దాసరిగా నటించనున్నారు. పూర్తి వివరాలు అతి త్వరలో ప్రకటిస్తాం” అన్నారు.