రామ్ చరణ్కు విజయవంతమైన మణికట్టు శస్త్రచికిత్స
రామ్ చరణ్కు కోయంబత్తూరులో విజయవంతమైన మణికట్టు శస్త్రచికిత్స
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుడి చేతి మణికట్టు (Right Wrist) సమస్యకు కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్లో విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది.
ఈ శస్త్రచికిత్సకు గంగా హాస్పిటల్ చీఫ్, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎస్. రాజశేఖరన్ నాయకత్వం వహించారు. ఎన్నో దశాబ్దాల అనుభవం, జాతీయ–అంతర్జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు అందుకున్న ఆయన ఆర్థోపెడిక్ రంగంలో ఒక లెజెండ్గా గుర్తింపు పొందారు. ఇదే డాక్టర్ రాజశేఖరన్ గతంలో చిరంజీవి గారికి అత్యంత క్లిష్టమైన వెన్నెముక శస్త్రచికిత్సను కూడా విజయవంతంగా నిర్వహించారు.
రామ్ చరణ్ మణికట్టు సమస్యకు అత్యుత్తమ చికిత్స అందించాలనే ఉద్దేశంతో, అమెరికాలోని మయామి కి చెందిన ప్రముఖ హ్యాండ్ అండ్ రిస్ట్ సర్జన్ డాక్టర్ అలెహాండ్రో బాడియాను ( Dr. Alejandro Badia) , ప్రత్యేకంగా కోయంబత్తూరుకు ఆహ్వానించారు. చేతి, మణికట్టు శస్త్రచికిత్సలు, ముఖ్యంగా స్పోర్ట్స్ ఇంజరీల చికిత్సలో ఆయన ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన నిపుణులు. సాధారణంగా ఆయన అపాయింట్మెంట్ పొందడమే ఎంతో కష్టమైన విషయం. అలాంటి ఆయన ప్రత్యేకంగా రామ్ చరణ్ కోసం రావడం విశేషం.
డాక్టర్ రాజశేఖరన్, డాక్టర్ అలెహాండ్రో బాడియా ( Dr. Alejandro Badia) , మరియు డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ
అలాగే వారి నిపుణుల బృందం కలిసి ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఆరోగ్య పరిస్థితి ఎంతో సంతృప్తికరంగా ఉందని, మరో నాలుగు రోజుల విశ్రాంతి అనంతరం హైదరాబాద్కు తిరిగి వచ్చే అవకాశం ఉందని సమాచారం.
ఈ సమయంలో చిరంజీవి–సురేఖ దంపతులు, ఉపాసన కోయంబత్తూరులోనే ఉండి రామ్ చరణ్కు తోడుగా ఉన్నారు. డాక్టర్ రాజశేఖరన్ గారికి చిరంజీవి గారితో ఎంతోకాలంగా ఆత్మీయ స్నేహబంధం ఉంది.
రామ్ చరణ్ త్వరగా పూర్తిగా కోలుకుని, మరింత ఉత్సాహంతో తన చిత్రీకరణల్లో పాల్గొనాలని అభిమానులందరూ కోరుకుంటున్నారు.