ఇంటర్నేషనల్ టార్చ్ కాంపెయిన్ ప్రారంభం

Published On: April 26, 2024   |   Posted By:

ఇంటర్నేషనల్ టార్చ్ కాంపెయిన్ ప్రారంభం

జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆధ్వర్యంలో  ఇంటర్నేషనల్ టార్చ్ కాంపెయిన్ ప్రారంభం
 సినిమాకు ఎల్లలు, హద్దులు లేవని తెలుగు సినిమాతో పాటు భారతీయ సినిమా, అలాగే ప్రపంచ సినిమాను ప్రోత్సహించడానికి,జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ సంస్థ ఫౌండర్ డైరెక్టర్ హను రోజ్ విశేషంగా కృషి చేస్తున్నారని పలువురు వక్తలు కొనియాడారు. గురువారం (25th)  సాయంత్రం హైదరాబాడ్ లోని ప్రసాద్ మల్టీఫ్లెక్స్ లో  ఆ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు సినిమాతో పాటు, ఇండియన్  ప్రపంచ సినిమాలకు మరింత ప్రచారం, మార్కెటింగ్ కల్పించడం కోసం ఆ సంస్థ ఇంటర్నేషనల్ టార్చ్ కాంపెయిన్ ను ప్రారంభించింది. దీనికి వేదికతో పాటు హోస్ట్ గా  ప్రసాద్ మల్టీఫ్లెక్స్ సహకారాన్ని అందించింది.
పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలనతో ఇంటర్నేషనల్ టార్చ్ కాంపెయిన్ ను ప్రారంబించారు.
ముందుగా  జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్  ఫౌండర్  డైరెక్టర్ హను రోజ్ మాట్లాడుతూ, 2009వ సంవత్సరం నుంచి మేము మా సంస్థ తరపున రెగ్యులర్ గా ఫిలిం ఫెస్టివల్స్ ను దేశవిదేశాలలో నిర్వహిస్తూ, అవార్డులను అందజేస్తూ  వస్తున్నాం. జాతీయ, అంతర్జాతీయ సినిమాను ప్రమోషన్ చేయడానికి ఎంతో కృషి చేస్తున్నాం. ఇందుకు ప్రభుత్వం కూడా మాకెంతో సహకరించింది. ప్రపంచస్థాయిలో చాలా పెద్ద  సినిమా లైబ్రరీని ఏర్పాటు చేశాం. దానిని నేటితరం, భవిష్యత్ తరం ఉపయోగించుకునేవిధంగా తీర్చిదిద్దుతున్నాం. ఈ టార్చ్ కాంపెయిన్ ను ప్రపంచ సినిమా స్థాయిలో నిలబడిన తెలుగు సినిమా కేంద్రం అయిన  హైదరాబాద్ లో తొలుత ప్రారంభించడం ఆనందంగా ఉంది” అని అన్నారు
అతిథిగా విచ్చేసిన తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ, సినిమా మీద ఎనలేని ప్రేమతో ప్రపంచ సినిమాను ఒక్కటి చేస్తున్న హను రోజ్ ఒక వ్యక్తి కాదు ఒక శక్తి. ఆయన చేస్తున్న అవిరళ కృషి మరపురానిది. ఈ రోజు ఇంటర్నేషనల్ టార్చ్ కాంపెయిన్ ను ఆయన హైదరాబాద్ లో మొదలు పెట్టడం అభినందనీయం” అని అన్నారు.
మరో అతిథి గా పాల్గొన్న తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, తెలుగు సినిమా ఎప్పుడో పాత తరం సినిమాల నుంచి ప్రపంచస్థాయికి ఎదిగింది. నేటి సినిమాలే కాదు అప్పట్లో తీసిన పాతాళ భైరవి, చండీరాణి, మోసగాళ్లకు మోసగాడు వంటి తెలుగు సినిమాలు ప్రపంచస్థాయిలో పేరు సంపాదించుకున్నాయి. ఎన్ఠీఆర్ సీఎంగా ఉన్న రోజులలో హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించి, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటారు. తెలుగు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నంది అవార్డులు ఇవ్వడం లేదు. ముందు ముందు అయినా ఇస్తాయని ఆశిస్తున్నాం” అని అన్నారు.
ఈ కార్యక్రమానికి సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు వ్యాఖ్యాతగా వ్యవహరించగా, ఇంకా నిర్మాతలు లక్ష్మణరేఖ గోపాలకృష్ణ, నాగులపల్లి పద్మిని, ఎమ్మెస్ ప్రసాద్, రామ్ కిషోర్,వై.అనిల్,  సీనియర్ జర్నలిస్ట్ ఉమామహేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.