దర్శకరత్న డి.ఎన్.ఆర్. ఫిల్మ్ అవార్డ్స్

దర్శకరత్న దాసరి 77వ జయంతిని పురస్కరించుకుని శిల్పకళావేదికలో దర్శకరత్న డి.ఎన్.ఆర్. ఫిల్మ్ అవార్డ్స్ ఘనంగా జరిగింది. సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.చిత్రసీమకు ఎటువంటి సహకారం కావాల్సినా తెలంగాణా ప్రభుత్వం ముందుంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దాసరి లెజండరి పురస్కారాలను ఆయన అందించారు. మరో ముఖ్య అతిధి, దాసరి లెజండరీ నటుడు అవార్డు అందుకున్న డాక్టర్ మోహన్ బాబు మాట్లాడుతూ “దర్శకకులానికి గౌరవం తెచ్చిన వ్యక్తి దాసరి. ఆయన పేరిట నెలకొల్పిన అవార్డు అందుకోవడం గర్వంగా భావిస్తున్నాను” అన్నారు.
ప్రముఖ దర్శకులు కోదండరామిరెడ్డి దాసరి లెజండరి డైరెక్టర్ అవార్డు, లెజండరీ ప్రొడ్యూసర్ అవార్డు అల్లు అరవింద్, లెజండరీ డిస్ట్రిబ్యూటర్ అవార్డు దిల్ రాజు, ప్రముఖ నటులు మురళీమోహన్ దాసరి లెజండరి ఫిలాంత్రఫిస్ట్ అవార్డు, లెజండరీ స్టోరీ రైటర్ అవార్డ్ పరుచూరి బ్రదర్స్ తరపున పరుచూరి గోపాలకృష్ణ, లెజండరీ ఎగ్జిబిటర్ అవార్డు సునీల్ నారంగ్, లెజండరీ లిరిక్ రైటర్ అవార్డు చంద్రబోస్ తరపున వారి సతీమణి సుచిత్ర చంద్రబోస్, లెజండరీ జర్నలిస్ట్ అవార్డు మాడభూషి శ్రీధర్ అందుకున్నారు. దాసరికి ఎంతో ఇష్టమైన పవన్ కళ్యాణ్ కి దాసరి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయని ఈ సందర్భంగా అల్లు అరవింద్ పేర్కొన్నారు. “బంట్రోతు భార్య”తో తనను నిర్మాతను చేసింది దాసరి గారే అని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు, సీనియర్ దర్శకులు ధవళ సత్యం, సీనియర్ నటీమణి రోజా రమణి, ఎస్.వి.కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, ఎన్. శంకర్, వీరశంకర్, దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్, అనిల్ వల్లభనేని, దొరైరాజ్, సి.హెచ్.సుబ్బారెడ్డి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ఆచంట గోపినాద్, మల్లిడి సత్యనారాయణరెడ్డి, సుచిర్ ఇండియా కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
“రైటర్ పద్మభూషణ్” చిత్రానికి ఉత్తమ సహాయనటిగా రోహిణి, “సామాజవరగమన” చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా వి.కె.నరేష్, “బింబిసార” చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా వశిష్ట, “బలగం” చిత్రానికి ఉత్తమ నిర్మాతగా హర్షిత్ రెడ్డి, “సామజవరగమన” చిత్రానికి ఉత్తమ నిర్మాతగా రాజేష్ దండా, “బేబి” చిత్రానికి ఉత్తమ వాణిజ్య చిత్ర నిర్మాతగా ఎస్.కె. ఎన్, ఉత్తమ సామాజిక చిత్రం విభాగంలో “భీమదేవరపల్లి బ్రాంచి” చిత్రానికి ఉత్తమ నిర్మాతగా కీర్తి లత గౌడ్ అవార్డులు అందుకున్నారు. స్పెషల్ అప్రిసియేషన్ అవార్డ్స్ శివ కంఠమనేని, హర్ష చెముడు, ఎమ్.ఎస్.ప్రసాద్, శరణ్య ప్రదీప్
అందుకున్నారు.
ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అధ్యక్షతన ఏర్పాటయిన సెలక్షన్ కమిటీలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, సీనియర్ సినీ పాత్రికేయులు ప్రభు, ధీరజ అప్పాజీ సభ్యులుగా. ప్రముఖ ఆడిటర్ బి.ఎస్.ఎన్.సూర్యనారాయణ కన్వీనర్ గా, ప్రముఖ నటులు ప్రదీప్ కో.ఆర్డినేటర్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న దాసరి టీమ్ మెంబర్స్ లో  పదిమందికి పదివేలు చొప్పున నగదు సాయం అందించారు. ప్రభు, నీహారిక తమదైన వ్యాఖ్యానంతో కార్యక్రమాన్ని రక్తి కట్టించారు!!