కమిటీ కుర్రోళ్ళు సినిమా సాంగ్‌ విడుదల

ఓటు విలువను చెప్పే సెటైరికల్ సాంగ్.. ఆలోచించి ఓటు వేయాలంటూ పాటతో చెప్పిన చిత్ర యూనిట్

ఎన్నికల సమయం దగ్గర పడుతుంది.. రాజకీయ పార్టీలు ప్రజలను ప్రలోభ పెట్టటానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నింటినీ అన్వేషిస్తున్నాయి. ఓట్లను డబ్బులతో కొంటున్నారు.. మందు, చీరలిచ్చి ఓటర్లను తమ వైపు తిప్పుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ఇది తప్పు.. ఓట్లను కొనేసి తర్వాతే ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ.. గొర్రెల్లా కాకుండా మనిషిలా ఆలోచించి ఓటు వేయాలంటూ చెబుతున్నారు ‘కమిటీ కుర్రోళ్ళు’. అది కూడా మాటగా కాదండోయ్.. చక్కటి పాట రూపంలో. ‘గొర్రెలా..’ అంటూ సాగే ఈ పాటను అనుదీప్ దేవ్ సంగీత సారథ్యంలో నాగ్ అర్జున్ రెడ్డి రాశారు. అనుదీప్ దేవ్, వినాయక్, అఖిల్ చంద్ర, హర్షవర్ధన్ చావలి, ఆదిత్య భీమతాటి, సింధూజ శ్రీనివాసన్, మనీషా పండ్రాంకి, అర్జున్ విజయ్ పాడారు.

జయప్రకాష్ నారాయణ  ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాలోని ‘గొర్రెలా..’ అనే పాటను విడుదల చేశారు. నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. య‌దు వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుంచి మంగళవారం ‘గొర్రెలా…’ అనే సాంగ్‌ను జయప్రకాష్ నారాయణ చేతుల మీదుగా విడుదలైంది. ఈ సందర్భంగా…

జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ ‘‘‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో ‘గొర్రెలా..’ అనే పాట పెట్టి ఊర్రుతలూగించారు. అలాగే యువతను ఆలోచింపచేశారు. దేశ భవిష్యత్తును కాపాడాలంటే యువతలో సరైన ఆలోచన ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని రేసీగా, ఉత్సాహంగా, ఆలోచనాత్మకంగా చక్కటి పాటను చిత్రీకరించారు. నిర్మాత నిహారికగారిని, డైరెక్టర్ వంశీగారిని, పాట రాసిన నాగార్జున, మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్‌లను ఈ సందర్భంగా మనసారా అభినందిస్తున్నాను. భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటు వేయాలని యువత సహా అందరినీ కోరుతున్నాను. మీకు సేవ చేయటం కోసం డబ్బులిచ్చేవాడు మిమ్మల్ని బలి తీసుకుంటున్నాడు. యువతలో ఓటు వేయటంలో మార్పు రావాలి. నిరాశ వద్దు.. ఆత్మ విశ్వాసంతో ముందుకు కదలాలి. కులాన్ని, వర్గాన్ని పక్కకు పెట్టి, మన బతుకులు గురించి ఆలోచించాలని కోరుతున్నాను. మరోసారి ‘కమిటీ కుర్రోళ్ళు’ టీమ్‌ను అభినందిస్తున్నాను’’ అన్నారు.