తెలుగు చలన చిత్ర మండలి ఎన్నికలు

ఆర్గనైజేషన్ కి ఎవరు చెడ్డ పేరు తెచ్చినా ఊరుకోము. ఫిబ్రవరి 19న తెలుగు చలన చిత్ర మండలి ఎన్నికలు సి. కళ్యాణ్ ప్రకటన.

తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాలను అధ్యక్షుడు సి. కళ్యాణ్ బుధవారంనాడు ఎఫ్.ఎన్.సి.సి.లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. గత కొద్దిరోజులుగా తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలిపై కొందరు బురద జల్లుతూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. కొందరు నిర్మాతలు ఛాంబర్ దగ్గర టెంట్ వేసి సమస్యలపై పోరాడుతున్నట్లు ప్రకటించి లేనిపోని అపనిందలు వేశారు. అందుకు కొన్నిచోట్ల మీడియాలో రకరకాలుగా వార్తలు రాశారు. నిర్మాతలమండలికి ఎలక్షన్లు జరపడంలేదంటూ కామెంట్లు చేశారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మేమంతా సమావేశం అయి ఏకగ్రీవ నిర్ణయంగా ఈరోజు నిర్ణయాలు ప్రకటిస్తున్నాం అని సి. కళ్యాణ్ తెలిపారు.

మండలిలో రెగ్యులర్ సభ్యులు 1200మంది వున్నారు. అలాంటి సంస్థపై కొందరు చేసిస కామెంట్ లను సోషల్ మీడియాలో కొంతమంది ఇష్టం వచ్చినట్లు బురద చల్లుతున్నారు. ఆర్గనైజేషన్ కి ఎవరు చెడ్డ పేరు తెచ్చినా ఊరుకోము. అలాంటి వారిపై కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాం. అందులో ప్రొడ్యూసర్ కే సురేష్ కుమార్ ని మూడేళ్లు సస్పెండ్ చేశాము. ఆయన యధావిధిగా సినిమాలు చేసుకోవచ్చు. అలాగే యలమంచి రవికుమార్ ని ఈరోజు నుంచి మా సంస్థ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తున్నాం. ఇకమీద తెలుగు చలనచిత్ర మండలికి ఆయనకి శాశ్వతంగా ఎలాంటి సంబంధం ఉండదు. 40 ఏళ్ల ఈ సంస్థలో వీళ్ళలాగా ఎవరు బిహేవ్ చేయలేదు. ఈ సంస్థ ఒక్కటే దీనిని కాపాడుకునే బాధ్యత అందరిపై ఉంది. నేను తప్పు చేసినా నాపై చర్యలు తీసుకోవచ్చు.

అదేవిధంగా ఎలక్షన్స్ జరగట్లేదు అని కొంతమంది రాద్ధాంతం చేస్తున్నారు. వాటన్నింటికి సమాధానమే ఈరోజు మేము పెట్టుకున్న మీటింగ్. మాకు ఎలాంటి పదవి వ్యామోహం లేదు. అందుకే ఎలక్షన్ తేదీని ప్రకటిస్తున్నాం. నేను ఎన్నికలకి పోటీ చేయదలచుకోలేదు. నేను ఒకసారి ఒక పదవిలో ఉంటే మళ్ళీ ఆ పదవికి పోటీ చేయను అని తెలిపారు.

– ఫిబ్రవరి 19న తెలుగు చలన చిత్ర మండలి ఎన్నికలు.
– ఫిబ్రవరి ఫస్ట్ నుంచి 6 వ తేదీ వరకు నామినేషన్స్ ప్రక్రియ కొనసాగుతుంది.
– ఒకరు ఒక పోస్ట్ కి మాత్రమే పోటీ చెయ్యాలి.
– 13వ తేదీ వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.
– కే దుర్గ ప్రసాద్ ఎన్నిక అధికారిగా కొనసాగబోతున్నారు.
– అదే రోజు సాయంత్రం ఈసీ మీటింగ్ జరుగుతుంది అని తెలిపారు.

ఇక కౌన్సిల్ ఫండ్ గురించి వివరిస్తూ, మా కౌన్సిల్ లో ప్రస్తుతం 9 కోట్ల ఫండ్ ఉంది. ఇంత అమౌంట్ పోగవ్వడానికి కారణం దాసరి నారాయణ రావు గారే. మాకు తిరుపతిలో ఒక బిల్డింగ్ ఉంది. మూవీ టవర్స్ లో రెండు కోట్ల 40 లక్షలు పెట్టుబడి పెట్టాం. ఇప్పుడు అది 10 కోట్లకు చేరింది. డిసెంబర్ 31వ తేదీ వరకు అకౌంట్స్ అన్ని ఈసీ లో పాస్ అయినవే అని అన్నారు.

సినిమా పరిశ్రమపై ప్రభుత్వాల తీరును గురించి ప్రస్తావిస్తూ, ఆంధ్రా కి సినిమా పరిశ్రమ వెళ్తుంది అని నేను అనుకోవట్లేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఒరిగేదేమీ లేదు. గతంలో అందాల్సిన సబ్సిడీ లే ఇంకా రాలేదు. పైగా గతంలో ఇచ్చిన నంది, ఇక్కడ సింహ అవార్డుల గురించి ఇద్దరు ముఖ్యమంత్రులతో మాట్లాడి మా సినిమారంగంపై రాజకీయరంగు పులమకండి అని ప్రాధేయపడతామని తెలిపారు.