న‌రేష్ వీకే ప్రెస్‌మీట్‌
 
నాలుగేళ్లుగా మా’ అసోసియేషన్ ప్ర‌తిష్ఠ‌ మసకబారిపోయింది అంటూ అసోసియేషన్‌తో ఎంతో అనుభవం ఉన్న మిత్రుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయి అని నరేష్ తాజా మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఆయన నాకు మంచి మిత్రుడే. మా అసోసియేషన్ కోసం మేం చేసిన కార్యక్రమాల్ని చిరంజీవి నాగబాబుకు చెప్పగా ప్రశంసించారని గుర్తు చేశారు. 
 
ఈ సంద‌ర్భంగా న‌రేష్ వీకే మాట్లాడుతూ – ‘‘2019లో పోటీ చేసి మెజారిటీతో గెలిచి, అభివృద్ధి చేసి చూపించా. నాకు కథలు చెప్పడం అలవాటు లేదు. ఏదైనా కాగితం ఆధారంగా ముందుకెళ్తా. నేను మాటల మనిషిని కాదు చేతల మనిషిని. నేను సినిమా పరిశ్రమలో పుట్టినవాడిని. సినీ పరిశ్రమకు ఎలాంటి సమస్య వచ్చినా మా కుటుంబం ఎప్పుడూ ముందు ఉంటుంది.  ప్రకాశ్‌రాజ్‌ నాకు మంచి మిత్రుడు. మూడు నెలల క్రితం ఫోన్‌ చేసి ఈ ఏడాది ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నాను అని చెప్పారు. తెలుగు సినిమాల్లో నటించే ఎవరైనా పోటీ చేయవచ్చని చెప్పాను. మంచు విష్ణు.. సినిమా బిడ్డ. కష్టాలు, లాభనష్టాల గురించి పట్టించుకోకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. తను కూడా ఈసారి ఎన్నికల్లో భాగమవుతా అన్నారు. ‘మా’ రాజకీయ పార్టీ కాదు. ఎవరు వచ్చినా స్వాగతిస్తాం’ అన్నాను. చిరంజీవి, కృష్ణంరాజు, కృష్ణ వంటి ఎంతోమంది సినీ పెద్దల ఒక్కొక్క ఇటుక పేర్చి ‘మా’ను స్థాపించారు. కృష్ణంరాజుగారికి ఫోన్‌ చేసి ప్రెస్‌మీట్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పాను. ‘‘మా’ ఒక దిగ్గజం. వంద ఏనుగుల బలం ఉంది దీనికి. ‘మా’ని కూల్చడం ఎవరికీ సాధ్యం కాదు’’ అని కృష్ణంరాజు చెప్పమన్నారు. అదే ధైర్యంతో ముందుకొచ్చాం.
 
మా’ అసోషియేషన్‌లో 914 మంది జీవితకాల సభ్యులు. 29 మంది అసోసియేట్‌ సభ్యులు 18 మంది సీనియర్‌ సిటిజన్స్‌ ఉన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి 728 మంది సభ్యులకు రూ.3 లక్షలతో జీవిత బీమా చేయించాం. మృతిచెందిన 16 మంది సినీ ఆర్టిస్టుల కుటుంబాలకు రూ.50 లక్షలు అందజేశాం. 314 మందికి ఆరోగ్య బీమా చేయించాం. రూ.3 వేల పించన్‌ను రూ.6 వేలకు పెంచాం. సభ్యత్వ రుసుము రూ.లక్ష నుంచి రూ.90 వేలకు తగ్గించాం. కొత్తగా 87మంది సభ్యులు అసోసియేషన్‌లో చేరారు. అసోసియేషన్‌పై నమ్మకం లేకపోతే ఎలా చేరతారు? జాబ్‌ కమిటీ ద్వారా 35 మంది వృద్థ కళాకారులకు సినిమాల్లో అవకాశం కల్పించాం. కరోనా కష్టకాలంలో ‘మా’ అసోసియేషన్‌కు రూ.30 లక్షల విరాళాలను అందాయి. వాటిలో రూ.10 లక్షలు జీవిత అందించారు. అందులో రూ.లక్షను సీసీసీకి పంపిచాం. అసోసియేషన్‌లో 20 ఏళ్లుగా సభ్యులుగా ఉన్నప్పటికీ ఎలాంటి పదవీ ఆశించలేదు. ఇప్పుడు రాజీనామా చేయడానికి సిద్థంగా ఉన్నాం. మేము పదవుల కోసం ఆశపడడం లేదు. కానీ మా పనుల్ని తక్కువగా చేసి మమ్మల్ని ఎందుకు హింసిస్తున్నారు. మేము హింసకు లొంగేది లేదు. మేం విజన్‌తో వచ్చాం..డివిజన్‌ని కలుపుతూ పని చేయాలనుకుంటున్నాం. ఈసారి ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకే ప్రయత్నిస్తున్నాం”అన్నారు