సితార  ప్రొడక్షన్ నెం.27 చిత్రం ప్రకటన

Published On: April 5, 2024   |   Posted By:

సితార  ప్రొడక్షన్ నెం.27 చిత్రం ప్రకటన

యువ కథానాయకుడు అశోక్ గల్లా తన తదుపరి చిత్రం కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తో చేతులు కలిపారు. సితార పతాకంపై ప్రొడక్షన్ నెం.27 గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఏప్రిల్ 5న అశోక్ గల్లా పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఈ చిత్రం ప్రేమ, హాస్యం మేళవింపుతో ఈ తరం మెచ్చే అందమైన కథతో రాబోతుంది. చిత్ర ప్రకటనకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్‌ ను బట్టి చూస్తే.. ఈ చిత్ర కథ అమెరికాలో జరుగుతుందని అర్థమవుతోంది.
“ది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ”తో కూడిన పోస్టర్ డిజైన్ ఆకట్టుకుంటోంది. “హ్యాపీ బర్త్‌డే అశోక్” అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు  తెలియచేసింది చిత్ర బృందం. అలాగే ఇది నేటి తరం యువతకు సులభంగా చేరువయ్యే చిత్రంగా కనిపిస్తోంది.
ప్రేమమ్’, ‘భీష్మ’, ‘భీమ్లా నాయక్’, ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ వంటి విజయవంతమైన చిత్రాలతో అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే సినిమాలను అందించే నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. అనతి కాలంలోనే తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటిగా ఎదిగింది. అలాంటి సితార సంస్థ నుంచి వస్తున్న సినిమా కావున, యువత మెచ్చే అంశాలతో పాటు కుటుంబ సమేతంగా చూసి ఆనందించేలా ఉంటుందని ఆశించవచ్చు. నిర్మాతలు ఇంకా ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించలేదు కానీ ఈ చిత్రం ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
‘లవర్‌’లో తన నటనతో విమర్శకుల మరియు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ‘మ్యాడ్’ మూవీ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.
ఉద్భవ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను నిర్మాతలు త్వరలో వెల్లడించనున్నారు.