2018 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

Published On: May 25, 2023   |   Posted By:

2018 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

తెలుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా 2018 నచ్చుతుంది, నాది హామీ  స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్

ప్రస్తుతం ఆడియన్స్ కి భాషతో సంబంధం లేకుండా ఒక మంచి సినిమా ఏ భాషలో ఉన్న కూడా చూడటం అలవాటు అయిపోయింది. రీసెంట్ టైమ్స్ లో క్రిస్టి, ఇరట్ట, రోమాంచం వంటి మలయాళం సినిమాలు రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా మే 5 న విడుదలైన మలయాళం సినిమా 2018. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ టాక్ తో ముందుకు సాగుతూ బీభత్సమైన కలక్షన్స్ ను రాబడుతుంది.

ఈ సినిమా మొదటి రోజు రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ కేవలం రూ.1.85 కోట్లు మాత్రమే. కానీ అనూహ్యంగా ఈ సినిమా కేవలం మౌత్ టాక్ తోనే పదిహేను రోజుల్లో 150 కోట్లకు పైగా వసూలు చేసింది. 2018 ఆగస్టు నెలలో ఋతుపవనాల కారణంగా కురిసిన అధిక వర్షాలు వలన, కేరళలో 2018 లో అధిక వరదలు సంభవించిన విషయం తెలిసిందే.ఇందులో సుమారుగా 164 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

కేరళ చరిత్రలో సుమారు ఓ శతాబ్దంలో ఇవే అతి పెద్ద వరదలు అని చెప్పొచ్చు. దీనిని బేస్ చేసుకుని జూడ్ ఆంథనీ జోసెఫ్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను రీసెంట్ రిలీజ్ చేసారు.కేరళ లోని ఒక మారుమూల పల్లెటూరు నేపథ్యంలో ఈ కథ జరుగుతుంది.దొంగ మెడికల్ సర్టిఫికెట్తో ఆర్మీలో చేరి.. అక్కడ ఉండడం ఇష్టం లేక పారిపోయి వచ్చే యువకుడిగా టోవినో థామస్ అనూప్ పాత్రలో కనిపిస్తాడు. కున్చాకో బోబన్,వినీత్ శ్రీనివాసన్, అసిఫ్ అలీ, లాల్, అపర్ణ బాలమురళి లాంటి ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో మనకు కనిపిస్తారు.

ఇది పాన్ ఇండియా సినిమా కాకపోయినా సంచలనాలకు ఏ మాత్రం తగ్గడం లేదు. మలయాళంలో సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత  బన్నీ వాసు రిలీజ్ చేయనున్నారు. 150 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా తెలుగులో మే 26న భారీ స్థాయిలో విడుదల కానుంది. అలానే ఈ సినిమాకి సంబంధించి, మీడియా వారికి వేసిన ప్రీమియర్ షో నుంచి అద్భుతమైన స్పందన రావడం విశేషం. అనంతరం జరిగిన పత్రికా సమావేశంలో చిత్ర దర్శకుడు జూడ్ ఆంథోనీ జోసెఫ్, సినిమాటోగ్రాఫర్ అఖిల్ జార్జ్, ఎడిటర్ చమన్ చక్కో హాజరు అయ్యారు, ఈ కార్యక్రమానికి స్టార్ దర్శకుడు హరీష్ శంకర్ ముఖ్య అతిధిగా హాజరై తెలుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా 2018 నచ్చుతుంది, నాది హామీ అని తెలిపారు.