అనుష్క, విజయశాంతి ప్రధాన పాత్రల్లో మూవీ నిర్మిస్తున్న నిర్మాత ఎస్ కే బషీద్

అనుష్క, విజయశాంతి ప్రధాన పాత్రల్లో మూవీ నిర్మిస్తున్నా రాజంపేటలో ఎంపీగా భారీ మెజార్టీతో గెలుస్తున్నా  నిర్మాత ఎస్ కే బషీద్

అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ మెజార్టీతో గెలవబోతున్నానని తెలిపారు నిర్మాత ఎస్ కే బషీద్. 2007లో అల్లరి నరేష్, వేణు హీరోలుగా అల్లరే అల్లరి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా తన ప్రస్థానం మొదలుపెట్టారు ఎస్ కే బషీద్. ఆ తర్వాత పలు చిత్రాలను నిర్మించారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి తాను వచ్చానని, అయితే అడుగడుగున ఇబ్బందులకు గురిచేశారని ఎస్ కే బషీద్ చెప్పారు. రాజకీయంగా తను ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు, తన కొత్త సినిమా విశేషాలను ఈ రోజు హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలిపారు నిర్మాత ఎస్ కే బషీద్.

నిర్మాత ఎస్ కే బషీద్ మాట్లాడుతూ  నేను అల్లరే అల్లరి సినిమాతో నిర్మాతగా చిత్ర పరిశ్రమకు వచ్చాను. వ్యాపారవేత్తగా, నిర్మాతగా కొనసాగుతున్నాను. గతంలో దర్శకుడు సురేష్ కృష్ణకు అడ్వాన్స్ ఇచ్చాను. ఆయన దర్శకత్వంలో విజయేంద్రప్రసాద్ గారి కథతో అనుష్క, విజయశాంతి ప్రధాన పాత్రల్లో ఓ సినిమాకు సన్నాహాలు చేసుకుంటున్నాను. ఇంకా వారితో నేరుగా సంప్రదింపులు జరపలేదు. డిస్కషన్స్ చేయబోతున్నాం. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తారు. ఒక పాట కంపోజిషన్ జరుగుతోంది. నా రాజకీయ ప్రయాణం గురించి చెప్పాలంటే వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ఏపీ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నాను. పార్టీ నన్ను గుర్తించి రాజంపేట పార్లమెంట్ సభ్యుడిగా టికెట్ ఇచ్చింది. నేను ప్రచారం చేసుకునేందుకు రాజంపేట వెళ్తే బీజేపీ నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర రాజకీయ నాయకులు నన్ను చాలా ఇబ్బందులు గురి చేశారు. నా నాయకులను, అనుచరులను అపహరించారు. దీనిపై కలెక్టర్ కు ఫిర్యాదు ఇచ్చాం. విచారణ జరుపుతున్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయ ప్రత్యర్థిగా చూస్తూ ఇబ్బందులు పెట్టడం సరికాదు. నాకు ఐటీ నోటీసులు ఇప్పించి, 150 కోట్ల రూపాయలు సీజ్ చేయించారు. కోర్టులపై నాకు నమ్మకం ఉంది. న్యాయస్థానంలో వీటిని ఎదుర్కొంటాను. ఎవరెన్ని కుట్రలు చేసినా రాజంపేటలో నేను ఎంపీగా గెలవడం ఖాయం. అతి కొద్ది సమయమే అక్కడ క్యాంపెయిన్ చేశాను. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఎంపీగా గెలిచి కాంగ్రెస్ పార్టీ, స్థానిక ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాననే ఆత్మవిశ్వాసంతో ఉన్నాను.అన్నారు.